
Ind Vs Eng 2026: భారత పురుషుల క్రికెట్ సెలక్షన్ కమిటీ ఆదివారం ఒక కీలక ప్రకటన చేసింది. రాబోయే ఇంగ్లాండ్ పర్యటనలో జరగబోయే మూడు మ్యాచ్ల వన్డే (ODI) సిరీస్ కోసం భారత జట్టును అధికారికంగా ప్రకటించింది.
ఈ జట్టులో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాడు శుభ్మన్ గిల్ను కెప్టెన్గా ఎంపిక చేయడం విశేషం. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం ద్వారా టీమిండియా వన్డేల్లో సరికొత్త శకానికి నాంది పలికినట్లు అయింది.
ఈ వన్డే జట్టులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సీనియర్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. అయితే, స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఎంపిక అనేది పూర్తిగా ఆయన ఫిట్నెస్ క్లియరెన్స్ పైనే ఆధారపడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా, అద్భుతమైన ఫామ్లో ఉన్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను ఈ సిరీస్ నుంచి పక్కన పెట్టడం అందరినీ షాక్కు గురిచేసింది.
వికెట్ కీపర్లుగా కె.ఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లు జట్టులోకి వచ్చారు. ఆల్రౌండర్ల విభాగంలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తో పాటు యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. స్పిన్ బాధ్యతలను కుల్దీప్ యాదవ్ చూసుకోనుండగా.. పేస్ విభాగాన్ని జస్ప్రీత్ బుమ్రా ముందుండి నడిపించనున్నాడు. బుమ్రాతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్లు ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఎంపికయ్యారు.
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే సిరీస్ పూర్తి షెడ్యూల్
ఇరు జట్ల మధ్య జూలై నెలలో మూడు వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి వన్డే మ్యాచ్ జూలై 14 (మంగళవారం) మధ్యాహ్నం 3:30 గంటలకు ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభమవుతుంది. రెండో వన్డే జూలై 16 (గురువారం) సాయంత్రం 5:30 గంటలకు సోఫియా గార్డెన్స్ లో జరుగుతుంది. ఇక ఆఖరి, మూడో వన్డే మ్యాచ్ జూలై 19 (ఆదివారం) మధ్యాహ్నం 3:30 గంటలకు చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారమే నిర్వహించబడతాయి.
ఐర్లాండ్ టీ20 సిరీస్ జట్టులో మార్పులు – వైభవ్ సూర్యవంశీకి చోటు
మరో ముఖ్యమైన సమాచారం ఏంటంటే.. టాటా ఐపీఎల్ 2026 లో ఎడమ కాలికి తగిలిన గాయం కారణంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) లో కోలుకుంటున్నాడు. ఈ గాయం కారణంగా ఆయన ఐర్లాండ్ టీ20 సిరీస్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. దీనితో ఐర్లాండ్ టూర్ కోసం శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని భారత జట్టును బీసీసీఐ అప్డేట్ చేసింది. ఈ అప్డేటెడ్ టీ20 స్క్వాడ్లోకి రికార్డుల వీరుడు, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయడం విశేషం. తిలక్ వర్మ ఈ జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కె.ఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ