ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు సంబంధించి మరో ముందడుగు పడింది. ఏపీలో పనిచేస్తున్న 891మంది
ఉద్యోగులు తెలంగాణకు శాశ్వత ప్రాతిపదికన (విభజన చట్టం ప్రకారం) వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం ఈ 891మంది ఉద్యోగుల జాబితాను తెలంగాణకు పంపింది. తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈ జాబితాను త్వరగా పరిశీలించి, అభిప్రాయాన్ని, అంగీకారం తెలియజేయాలని ఈ వివరాలతో ఏపీ సీఎస్ తెలంగాణ సీఎస్కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి గ్రీన్సిగ్నల్ వస్తే ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల శాశ్వత బదిలీల ప్రక్రియ పూర్తవుతుంది. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లడానికి గతంలో 1943మంది ఆప్షన్ను ఎంచుకున్నారు. వీరిలో 891మంది ఉద్యోగులు ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగుల్ని ఏపీ, తెలంగాణకు విభజించింది. తెలంగాణ జిల్లాలకు చెందినవారు కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్కు వెళ్లారు.. 2014 నుంచి అక్కడే కొనసాగాల్సిన పరిస్థితి వచ్చింది. తాము పండుగలు, కుటుంబ కార్యక్రమాలు, ఇతర సందర్భాల్లో ఇంటికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందంటున్నారు. సొంత రాష్ట్రంలో పని చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కొంతమంది ఉద్యోగులు ప్రతి శుక్రవారం సాయంత్రం ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్నారు. మళ్లీ సోమవారం ఏపీకి వెళుతున్నారు. ఈ సమస్య 12 ఏళ్లుగా కొనసాగుతోంది.. తాజాగా ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కీలక ముందడుగు పడింది. అంతేకాదు ఏపీ ప్రభుత్వం ఇటీవల అమరావతి సచివాలయం, రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో 5 రోజుల పనిదినాలను మరో ఏడాది పాటూ పొడిగించింది. ఈ గడువు ఈ నెలతో ముగియడంతో ఆ ఉత్తర్వులను పొడిగించారు. అంతేకాదు హైదరాబాద్ నుంచి వచ్చేందుకు ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రైలు కూడా నడుస్తోంది. ఏపీ ప్రభుత్వం వినతి మేరకు ఈ రైలును నడుపుతుండగా.. ఈ రైలు ప్రతిరోజూ ఉదయం లింగంపల్లి నుంచి గుంటూరు మీదుగా విజయవాడకు ఈ రైలు నడుస్తోంది. ప్రతి రోజూ సాయంత్రం మళ్లీ విజయవాడలో ప్రారంభమై రాత్రికి లింగంపల్లి చేరుకుంటుంది