
ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ భేటీ కోల్ కత్తా: వీసా స్టీల్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ విశాల్ అగర్వాల్ ( Vishal Agarwal), ఇమామీ గ్రూప్ డైరక్టర్ ఆదిత్య ఆగర్వాల్ (Aditya Agarwal), శ్రీ సిమెంట్స్ వైస్ చైర్మన్ ప్రశాంత్ బంగూర్ (Prashant Bangur)లతో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కోల్ కతాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు, విధానాలను మంత్రి ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనకు వ్యూహాత్మకంగా సంస్కరణలను అమలుచేస్తున్న తీరును వివరించారు. తూర్పు తీర ప్రాంతంలో కీలక ఆర్థిక భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ పోషిస్తున్న పాత్రను ప్రస్తావించారు.
విస్తారమైన తీరప్రాంతం, ప్రపంచ స్థాయి ఓడరేవులు, మెరుగుపడుతున్న లాజిస్టిక్స్, భూమి, విద్యుత్ లభ్యత, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలు ఏపీలో సానుకూల అంశాలుగా పేర్కొన్నారు. భారతదేశంలో ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యంగా మంత్రి లోకేష్ చెప్పారు.
దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడులలో ఒకటైన ‘ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్’ (ArcelorMittal Nippon Steel) ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పనులు ఇప్పటికే అనకాపల్లి సమీపంలో ప్రారంభమయ్యాయని తెలిపారు. దీనిద్వారా రాష్ట్రం ఉక్కు పరిశ్రమకు ఒక ప్రధాన కేంద్రంగా వేగంగా ఎదుగుతుందని చెప్పారు.
ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు జాతీయ ఆర్థిక ధోరణులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, తయారీ రంగ పోటీతత్వం, పరిశ్రమ-ప్రభుత్వ సహకారాన్ని మరింతగా పెంపొందించే అవకాశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పెట్టుబడులను సులభతరం చేయడం, పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న చురుకైన విధానాన్ని వారు అభినందించారు.
.
రాష్ట్రాభివృద్ధిలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు భాగం కావాలని విజ్ఞప్తి చేశారు