
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలతో పాటు సామాన్య ప్రజానీకం తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం, వాడపాలెం గ్రామస్తులు ఒక వినూత్నమైన, పురాతనమైన ఆచారాన్ని తెరపైకి తెచ్చారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ గ్రామస్తులంతా కలిసి ఘనంగా 'కప్పల పెళ్లి' జరిపించారు.
వాడపాలెం గ్రామంలోని వంతెన సెంటర్ వద్ద డాక్టర్ పెద్దింటి రామం పురోహితులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వరుణ దేవుడు కరుణించి తొలకరి జల్లులు కురిపించాలని, తద్వారా పాడిపంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామస్థులందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ వేడుకను జరిపారు.
పూర్వకాలం నుంచి వస్తున్న నమ్మకం ప్రకారం.. కప్పలకు శాస్త్రోక్తంగా వివాహం చేస్తే వర్షాలు తప్పక కురుస్తాయని స్థానికులు విశ్వసిస్తున్నారు.రెండు కప్పలను పట్టుకొచ్చి, వాటికి పసుపు, కుంకుమ రాసి, పూలతో అందంగా అలంకరించి సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు.
అనంతరం డప్పులు, భజంత్రీల వాయిద్యాల నడుమ కప్పల జంటను గ్రామ వీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగించారు. యువకులు ఉత్సాహంగా డప్పులు వాయిస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ వినూత్న వేడుకను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు ఆసక్తిగా తరలివచ్చారు.
ప్రకృతి కరుణించి వెంటనే వర్షాలు కురవాలని గ్రామస్తులు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు
.