
రూ.3.25 కోట్ల వ్యయంతో హిందూ శ్మశాన వాటిక ఆధునీకరణ మంగళగిరి: పాత మంగళగిరి బిట్రావారి వీధి, దింపుడు కళ్లం వద్ద ఆధునిక సదుపాయాలతో నిర్మించిన మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానాన్ని ఆధునీకరించారు.
మొత్తం 2.90 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. ఇందులో 1.90 ఎకరాలు హిందూ శ్మశానవాటిక కాగా.. మరో ఎకరం క్రైస్తవుల సమాధుల కోసం కేటాయించారు. హిందూ వైకుంఠ మహాప్రస్థానాన్ని ఫీనిక్స్ ఫౌండేషన్ రూ.3.25 కోట్ల సీఎస్ఆర్ నిధుల భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు.
దీంతో పాటు మంత్రి లోకేష్ సొంత నిధులను కూడా వెచ్చించారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా నాలుగు ఆధునిక దహన వేదికలు(ఉడ్ ఫైర్స్), వాటి ఎదురుగా నాలుగు నిరీక్షణ మందిరాలు, అంత్యక్రియలకు హాజరయ్యే బంధువుల సౌకర్యార్థం ఒకేసారి 60 మంది కూర్చోవడానికి వీలుగా భోజనశాల నిర్మించారు.
భోజనశాల పక్కనే కార్యాలయంతో పాటు అస్థికలు భద్రపరిచే గది నిర్మించారు. పిండ ప్రదానాల కోసం రెండు ప్రత్యేక ఆచార గదులు, స్టోర్ రూమ్, క్షౌరశాల ఏర్పాటుచేశారు. పురుషులు, మహిళలకు రెండు వేర్వేరు మరుగుదొడ్లు, దహన సంస్కారాలకు కలప నిల్వ చేసేందుకు ప్రత్యేక షెడ్, రెండు మార్చురీ బాక్స్ లు, విద్యుత్ అంతరాయం లేకుండా 15 కేవీఏ సామర్థ్యం గల జనరేటర్ ఏర్పాటుచేశారు.
ఆవరణలో సుందరీకరణ పనులు, శిల్పాలు, సోలార్ వీధి దీపాలు, కార్యాలయ, భోజనశాల ఫర్నీచర్, నిరీక్షణ మందిరాల కోసం 50 కుర్చీలు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, మండల పార్టీ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావుతో పాటు
కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.