
కరీంనగర్ జిల్లా చొప్పదండి పర్యటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకార సంఘాలకు కీలక సూచనలు చేశారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే దీర్ఘకాలంలో భారీ స్థాయిలో ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు.
ముఖ్యంగా 1 మెగావాట్ సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ ద్వారా సంవత్సరానికి సుమారు రూ.50 లక్షల వరకు ఆదాయం ఆర్జించవచ్చని పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా ఆయన ముందుగా జన ఔషధి కేంద్రాన్ని సందర్శించి అక్కడి కార్యకలాపాలను పరిశీలించారు. తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు జన ఔషధి కేంద్రాల సేవలను మరింతగా వినియోగించుకోవాలని సూచించారు.
అనంతరం చొప్పదండి శివారులో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ను సందర్శించి, దాని పనితీరు, పెట్టుబడి వ్యయం, రుణ సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కుసుం (PM-KUSUM) పథకం ద్వారా సహకార సంఘాలను సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వామ్యం చేసేందుకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
ఈ పథకం కింద ప్రాజెక్టు వ్యయంలో 80 శాతానికి పైగా రుణ సదుపాయం నాబార్డ్ ద్వారా అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ.3.80 కోట్ల వ్యయం అవుతుందని, ఇందులో సహకార సంఘం సుమారు రూ.40 లక్షలు మాత్రమే పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుందని వివరించారు.
మిగిలిన మొత్తం రుణంగా లభిస్తుందని తెలిపారు. సాధారణంగా 4 శాతం వడ్డీ రేటు ఉండగా, ఈఎంఐలను సకాలంలో చెల్లించే వారికి 3 శాతం వరకు వడ్డీ రాయితీ లభిస్తుందని చెప్పారు. దీంతో తక్కువ వడ్డీతోనే ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయవచ్చన్నారు.
సోలార్ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను డిస్కంలు యూనిట్కు సుమారు రూ.3 చొప్పున కొనుగోలు చేస్తాయని, దీని ద్వారా సహకార సంఘాలకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. భూమి అందుబాటులో ఉన్న
ప్రాంతాల్లో సుమారు మూడు ఎకరాల స్థలం ఉంటే 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయవచ్చని సూచించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు కొద్ది సహకార సంఘాలు మాత్రమే ఈ తరహా ప్రాజెక్టులను ప్రారంభించాయని, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఏర్పాటు చేసిన ప్లాంట్ అందులో ముఖ్యమైనదని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో కూడా కొన్ని సోలార్ ప్లాంట్లు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. మరిన్ని సహకార సంఘాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
వ్యక్తిగతంగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే వారికి కూడా రుణ సదుపాయం అందుబాటులో ఉందని, అయితే వడ్డీ రేటు కొంత ఎక్కువగా ఉంటుందని వివరించారు. భూమి ఉన్న రైతులు, సహకార సంఘాలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయ వనరును పొందవచ్చని బండి సంజయ్ సూచించారు.
TG20 లీగ్పై వివాదం.. విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై ఈఓడబ్ల్యూ ఫోకస్
.