దేశవ్యాప్తంగా లోక్సభ, శాసనసభ స్థానాలను 50 శాతం దామాషా పద్ధతిలో పెంచేలా స్పష్టమైన నిబంధనలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే ‘ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ’ను మళ్లీ తీసుకురానుందని, దీని వల్ల దక్షిణాదికి ఎటువంటి అన్యాయం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కౌంటర్ ఇచ్చారు. దక్షిణాదికి జరిగే అన్యాయం మీకు కనిపించడం లేదా?
అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చంద్రబాబుపై థరూర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్తో సహా ఆయన వివరించారు. ఒకవేళ 50 శాతం దామాషా పద్దతిలో పెంచారని అనుకుంటే 20 స్థానాలున్న కేరళలో 30కి పెరుగుతాయని, అదే 80 స్థానాలున్న యూపీలో 120కి చేరుతాయని, ఇది 120 Vs 30గా మారితే ఎలా ఉంటుంది?
అని అన్నారు. ‘‘నాయుడుగారు ఓ చిన్న ఆలోచనాత్మక ప్రయోగాన్ని పరిశీలిద్దాం.. ఉదాహరణకు మీ జీతం రూ.2 లక్షలు.. మీ డ్రైవర్ జీతం రూ.20,000 అనుకుందాం.. మీరు చెప్పినట్టే ఇరువురి జీతం 50 శాతం పెంచారు.. అప్పుడు మీ జీతం రూ.3 లక్షలు అవుతుంది..
అదే డ్రైవర్కు రూ.30,000కు పెరుగుతుంది.. ఇక్కడ శాతం, నిష్పత్తి పెరుగుదలలో ఇద్దరికీ సమానమే. కానీ, గతంతో పోల్చితే మీ డ్రైవర్ కంటే మీరే ఎక్కువ ప్రయోజనం పొందారు కదా? మీ తోటి దక్షిణాది ముఖ్యమంత్రుల ఆందోళన కూడా దీని గురించే. ఈ రోజు ఉత్తర్ ప్రదేశ్కి ఉన్న 80 మంది ఎంపీలకు, కేరళకు ఉన్న 20 మంది ఎంపీలకు మధ్య వ్యత్యాసం ఏమీ లేదు అని అనుకుంటున్నారా?
ఒకవేళ అది 120 వర్సెస్ 30గా మారితే ఎలా ఉంటుంది? నిష్పత్తి పరంగా తేడా అంతే ఉన్నప్పటికీ రాజకీయ ప్రాధాన్యతలో మాత్రం చాలా వ్యత్యాసం వస్తుంది.. కేరళలో కేవలం 10 సీట్లు మాత్రమే పెరిగితే, యూపీకి ఏకంగా 90
సీట్లు పెరుగుతాయి. ఈ పరిణామం మీకు ఎంతమాత్రం ఆందోళన కలిగించడం లేదా?’’ అని శశిథరూర్ ప్రశ్నించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సమావేశానికి హాజరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు.. ఎకనమిక్ టైమ్స్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నియోజకవర్గాల పునర్విభజన అంశం గురించి మాట్లాడారు. ‘‘ప్రభుత్వం ఉద్దేశం మొదటి నుంచీ చాలా స్పష్టంగా ఉంది. అన్ని రాష్ట్రాల్లో సీట్లను 50% పెంచుతామని, నిష్పత్తిలో ఎలాంటి మార్పు ఉండదని సభలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.. బిల్లు ముసాయిదాలో ఆ విషయాన్ని చేర్చకపోవడం అనేది కేవం సాంకేతిక లోపం మాత్రమే. కానీ దీనిని ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేశాయి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.ఈ ఏడాది ఏప్రిల్లో నియోజకవర్గాల పునర్విభజన కోసం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును మోదీ ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుత 543 స్థానాలను 850కు పెంచేలా తీసుకొచ్చిన ఈ బిల్లు లోక్సభలో వీగిపోయింది. బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజార్టీ సాధించలేకపోవడంతో ఆమోదం పొందలేదు. గడచిన 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందకపోవడం ఇదే మొదటిసారి. అయితే, మళ్లీ ఈ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు మోదీ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది.