
హైదరాబాద్ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో సరదాగా ఆడుకుంటున్న 16 నెలల చిన్నారి క్షణాల్లోనే విషాదానికి గురైంది. ప్రమాదవశాత్తు బాత్రూమ్లోని నీటి బకెట్లో పడిపోవడంతో ఊపిరాడక మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం..
కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్బాబా నగర్ సీ-బ్లాక్లో మహ్మద్ ఆసిఫ్ ఖాన్, హబీబా ఉన్నీసా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఆయత్ ఖాన్ అనే 16 నెలల కుమార్తె ఉంది. ఇటీవల కుటుంబ సభ్యులంతా కలిసి బంధువుల ఇంటికి వెళ్లగా, ఈ ఘటన అక్కడే చోటుచేసుకుంది.
సోమవారం మధ్యాహ్నం పాపకు స్నానం చేయించిన తల్లి, ఇతర పిల్లలతో ఆడుకోవడానికి వదిలి తన పనుల్లో నిమగ్నమైంది. ఈ సమయంలో అందరి దృష్టి తప్పించుకుని చిన్నారి బాత్రూమ్లోకి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా, నీటితో నిండిన బకెట్లో అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించి షాక్కు గురయ్యారు.
వెంటనే ఆమెను చంద్రాయణగుట్టలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నాంపల్లిలోని నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించక మంగళవారం చిన్నారి మృతి చెందింది.
ఈ ఘటనపై కంచన్బాగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్షణాల నిర్లక్ష్యం ఓ పసిప్రాణాన్ని బలితీసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు నీటితో నిండిన బకెట్లు, టబ్బులు వంటి వాటిని ఎల్లప్పుడూ మూతపెట్టి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు.
చిన్న జాగ్రత్తే పెద్ద ప్రమాదాన్ని నివారించగలదని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గుతున్నా... ఆ మంత్రి ఆదాయం పెరుగుతోంది : కేటీఆర్ TG20 లీగ్పై వివాదం.. విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు
.