
ఏపీ హోంమంత్రి అనితపై వైసీపీ అధికార ప్రతినిధి, బుల్లితెర యాంకర్ శ్యామల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన శ్యామల, “హోంమంత్రి అనితకు మేకప్ మీద ఉన్న ప్రేమ మనుషుల ప్రాణాల మీద లేదు” అని వ్యాఖ్యానించారు.
జ్ఞానేశ్వరి, సాయికృష్ణ కేసులపై హోంమంత్రి ఎందుకు మాట్లాడటం లేదని శ్యామల ప్రశ్నించారు. “సాయికృష్ణ మీద కేసులుంటే అతన్ని లాకప్ డెత్ చేస్తారా? ఇంకా ఎక్కువ కేసులున్న టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు ఎందుకు అదే ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు?” అని నిలదీశారు.హోంమంత్రి అనిత మహిళల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని, అధికార మదంతో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని శ్యామల ఆరోపించారు.
వైసీపీ అధినేత జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అనిత అత్యంత నీచంగా మాట్లాడారని విమర్శించారు. “మేము ఏదైనా మాట్లాడితే మహిళకు అవమానం అంటూ రచ్చ చేస్తారు. ఇవేనా మీ ఎల్లో మీడియా, ఐ-టీడీపీ చేసే నీచ రాజకీయాలు?” అని ప్రశ్నించారు. హోంమంత్రి బాధ్యత మహిళలకు రక్షణ కల్పించడమని, దాన్ని వదిలేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కాకినాడలో చిన్నారి మిస్సింగ్ కేసుపై కూడా హోంమంత్రి స్పందించడం లేదని దుయ్యబట్టారు
.