
ఒకప్పుడు మంచి డిగ్రీ, ఆ తర్వాత ఎంబీఏ చేస్తే జీవితంలో సెటిల్ అయిపోయినట్టే అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారుతున్నాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. కేవలం డిగ్రీలు, ఉన్నత చదువులపై ఆధారపడకుండా భవిష్యత్తు అవసరాలకు సరిపోయే నైపుణ్యాలను పెంచుకోవాలని యువతకు సూచించారు.ఓ పాడ్కాస్ట్లో మాట్లాడిన ఆయన..
గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక వెంటనే ఎంబీఏ, పీజీ లేదా యూపీఎస్సీ వంటి పరీక్షల వైపు వెళ్లడం చాలా మంది యువతలో కనిపిస్తున్న ధోరణి అని చెప్పారు. అయితే ఆ చదువులు నిజంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తాయా లేదా అన్న అంశాన్ని కూడా ఆలోచించాలని సూచించారు.
సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్, ఎంబీఏలకు గ్లోబలైజేషన్ కాలంలో భారీ డిమాండ్ ఉండేదని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని వ్యాఖ్యానించారు.భవిష్యత్తులో వెల్డింగ్, ప్లంబింగ్, కార్పెంట్రీ, ఎలక్ట్రికల్ పనుల వంటి వృత్తి నైపుణ్యాలకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు.
స్విట్జర్లాండ్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాల్లో ఇలాంటి వృత్తులకు ఎంతో గౌరవం ఉంటుందని గుర్తు చేశారు. అలాగే కౌన్సెలింగ్, కేర్గివింగ్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో మానవ నైపుణ్యాలను కృత్రిమ మేధస్సు పూర్తిగా భర్తీ చేయలేదని చెప్పారు.ఆరోగ్యం కూడా ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపుతుందని అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు.
దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడం కంటే ముందే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయనే అంశం ఆందోళన కలిగిస్తోందన్నారు. శారీరక శ్రమ తగ్గడం, వ్యాయామం లేకపోవడం, ఆలస్యంగా భోజనం చేయడం వంటి అలవాట్లు ఊబకాయం