
మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)పై తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత (Kavitha) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ హరీశ్ రూ.40లక్షల టన్నుల బొగ్గు స్కామ్ (Coal scam) జరిగిందని అంటున్నారని, సరైన సమాచారం లేకుండానే కోల్ బెల్ట్లో తిరుగుతున్నారంటూ వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy)కూడా హరీశ్ రావు మాయలో పడ్డారన్నారు.
హరీశ్రావు లేఖ రాయగానే, కిషన్రెడ్డి వెంటనే మరో లేఖ రాశారని తెలిపారు. తెలంగాణలో ఓపెన్ కాస్ట్లతో సమానంగా అండర్ గ్రౌండ్స్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సింగరేణిలో పరిస్థితి మారలేదని కవిత వ్యాఖ్యానించారు.
కార్మికులపై అత్యంత కర్కశంగా యాజమాన్యం వ్యవహరిస్తోందని, ప్రశ్నించే కార్మికులను అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. దీనంతటికీ కారణం ప్రభుత్వ అలసత్వమే అని మండిపడ్డారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సింగరేణిలో పర్యటించారని, కానీ కార్మికుల సమస్యలను తెలుసుకోలేదన్నారు.
భట్టి విక్రమార్క పర్సంటేజ్లు తీసుకోవడం మానేయాలని, ఆ తర్వాతే ప్రతిపక్షాలపై విమర్శలు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ 2012లో బొగ్గు స్కామ్ చేసిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ బొగ్గు బ్లాక్ల వేలం ప్రక్రియ చేపట్టిందని తెలిపారు.
సింగరేణి కూడా వేలంలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని తెలంగాణ బ్లాక్లను సింగరేణికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆదాయ పన్ను సమస్యను పరిష్కారం చేయాలన్నారు.
బీజేపీ రాష్ట్రంలోకి వస్తేనే ఐటీ సమస్య పరిష్కారం చేస్తామని కిషన్ రెడ్డి అంటున్నారని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, సింగరేణిలోనూ గెలిచే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. పార్టీ పేరు అంశంలో మాకు క్లారిటీ ఉంది. కొత్త పార్టీపై ఫిర్యాదులు చేస్తున్నారంటే, మేం బలంగా ఉన్నట్టే కదా అంటూ కవిత పేర్కొన్నారు
.