
టాలీవుడ్ విలక్షణ దర్శకుడు దేవ కట్టా తన తదుపరి ప్రాజెక్టుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తాను ఏ ఇతర సినిమాకు పనిచేయడం లేదని, పూర్తిగా తన సొంత సినిమా పనుల్లోనే నిమగ్నమై ఉన్నానని సోషల్ మీడియా
వేదికగా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) లో ఓ కీలక ప్రకటన చేశారు."గత కొంతకాలంగా నా తదుపరి సినిమా రచన, అభివృద్ధి పనులతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాను. నా రాబోయే ప్రయాణం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను" అని దేవ కట్టా తన పోస్ట్లో పేర్కొన్నారు.అదే సమయంలో తనపై వస్తున్న కొన్ని వదంతులను ఆయన తీవ్రంగా ఖండించారు. "కొన్ని క్లిక్స్ కోసం దురుద్దేశంతో ప్రచారంలో ఉన్న పుకార్లకు స్పష్టత ఇస్తున్నాను. నేను ఏ ఇతర సినిమాకు ఒక్క షాట్ కూడా దర్శకత్వం వహించడం లేదు" అని ఆయన స్పష్టం చేశారు. తన తదుపరి చిత్రాన్ని కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదిగా అభివర్ణించారు. సరైన సమయం వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. ‘ప్రస్థానం’, ‘రిపబ్లిక్’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దేవ కట్టా ప్రకటనతో ఆయన తదుపరి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.