ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి అభివృద్ధితో పాటుగా రోడ్ల కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది. అయితే రాజధాని రోడ్ల నిర్మాణంలో కొంతమంది ఇళ్లు, స్థలాలు పోగొట్టుకుంటున్నారు.. అలాంటి వారి కోసం కీలక నిర్ణయం
తీసుకున్నారు. రోడ్ల నిర్మాణంలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్నవారికి అద్దె చెల్లించాలని.. రాజధాని సమస్యలపై నియమించిన మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్లతో కూడిన త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. ఏడాది పాటు రూ.10వేల చొప్పున అద్దె చెల్లించనున్నారు. ఇళ్లు కోల్పోతున్నవారికి ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించాక మూడు నెలల్లోగా అక్కడికి వెళ్లేందుకు సమయం ఇవ్వాలని త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రోడ్ల విస్తరణ, ప్లాన్లో పార్కింగ్ జోన్ల అంశాన్ని గమనించి ఎఫ్ఎస్ఐ పెంచాల్సిన అవసరం ఉందని త్రిసభ్య కమిటీ సీఆర్డీఏ కమిషనర్కు తెలిపింది. త్వరలో రైతులతో సమావేశం నిర్వహించి.. ఆర్-3 నివాస, వాణిజ్య ప్లాట్లలో 2,000 గజాలపైగా విస్తీర్ణం ఉన్న వాటికి సంబంధించిన ఎఫ్ఎస్ఐ (ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్) సమస్యపై చర్చించనున్నారు. గుంటూరు జాయింట్ కలెక్టర్ పది రోజుల్లోగా గ్రామకంఠాల్లో 10 సెంట్ల లోపు భూసేకరణ జరుగుతున్న ప్లాట్ల అంశంపై పూర్తి చేసి నిర్ణయం చెప్పనున్నారు. తుళ్లూరులో మధ్య నుంచి రోడ్డు నిర్మాణం చేయనున్నారని.. ప్రజల కోసం సర్వీస్ రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ కోరారు.తాడికొండ రోడ్డును విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.. దీని కోసం భూసేకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీఆర్డీఏ కమిషనర్.. ఈ రోడ్డు నిర్మాణంలో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన వారికి నష్ట పరిహారం, టీడీఆర్ బాండ్లు ఇచ్చేందుకు గడువును 45 రోజులు కోరారు. ప్రస్తుతం అమరావతి భూసమీకరణలో భూములు ఇస్తున్న రైతులకు త్వరగా ప్లాట్లు కేటాయిస్తాము అన్నారు. సమావేశంలో పలు కీలక అంశాలపై కూడా చర్చించారు. అలాగే రాజధానికి భూములిచ్చిన రైతుల వార్షిక కౌలు చెల్లింపు, కాల పరిమితి అంశాలపై వచ్చే సమావేశంలో చర్చించాలని నిర్ణయం తీసుుకున్నారు. రెండువారాల తర్వాత మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.