
జనసేన పార్టీలో ప్రక్షాళన దిశగా అధినేత పవన్ కల్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పార్టీ కమిటీలన్నింటినీ రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా, నగర, మండల, గ్రామ
స్థాయి కమిటీలను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు.నెల్లూరు జిల్లాలో నాయకుల మధ్య తీవ్రమైన విభేదాలు, క్రమశిక్షణారాహిత్యం పెరిగిపోయిందని పార్టీ అధిష్ఠానం దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. నాయకులు పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, వారి వైఖరి వల్ల కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జన సైనికులు, పార్టీ మద్దతుదారుల నుంచి ఫిర్యాదులు అందాయని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు."క్రమశిక్షణ లేని చోట వ్యవస్థను సక్రమంగా నిర్వహించలేం. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది" అని పవన్ వివరించారు. కొద్ది రోజుల క్రితమే ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని కూడా ఇదే కారణాలతో రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అదే తరహా చర్యను ఇప్పుడు నెల్లూరు జిల్లా విషయంలోనూ తీసుకున్నట్లు తెలిపారు.ఈ నిర్ణయంతో జిల్లా సమన్వయ బాధ్యతలు చూస్తున్న వారితో సహా కమిటీల్లోని సభ్యులందరూ తమ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లయింది. కొత్త కమిటీని నియమించేంత వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ వ్యవహారాలను కేంద్ర కార్యాలయం నుంచే పర్యవేక్షిస్తామని జనసేన స్పష్టం చేసింది.