
దిల్లీ: భారత్- అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పంద అంశాలను ఖరారు చేసేందుకు ఇరుదేశాల అధికారులు నాలుగు రోజులుగా నిర్వహించిన చర్చలు నేటితో ముగిశాయి. వస్తు వాణిజ్యం, నాన్- టారిఫ్ చర్యలు, కస్టమ్స్, వాణిజ్య సరళీకరణ తదితర అంశాలపై నిర్మాణాత్మక, సానుకూల చర్చలు జరిగాయని వాణిజ్యశాఖ తెలిపింది. వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసే పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఇరుపక్షాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయని ఓ ప్రకటనలో పేర్కొంది. గత ఫిబ్రవరిలో ఇరు దేశాలు ఈ ఒప్పందానికి సంబంధించిన ముసాయిదాను ప్రకటించగా.. అందులో ఏయే అంశాలు ఉండాలనే దానిపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన ఈ చర్చల్లో అమెరికా బృందానికి బ్రెండాన్ లించ్ నాయకత్వం వహించగా.. భారత్ తరఫున వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి దర్పణ్ జైన్ నేతృత్వం వహించారు. తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)లో చాలా వరకు అంశాలను ఇరుదేశాలు ఖరారు చేసుకున్నాయని వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ ఇటీవల తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.