
తెలుగు సినీ చరిత్రలో కైకాల సత్యనారాయణ గారి స్థానం సుస్థిరం. దాదాపు 55 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 800కు పైగా చిత్రాలలో నటించిన ఆయన, నవరసాలను అలవోకగా పండించగల విలక్షణ నటుడిగా పేరుగాంచారు. ప్రతి పాత్రను పాదరసంలా ఒదిగిపోయి చేసే ఆయన సినీ గమనం అనేక మలుపులతో కూడుకున్నది. తొలుత హీరో కావాలనే ఆశతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన సత్యనారాయణ గారికి అది సాధ్యపడలేదు. అప్పటి దర్శక దిగ్గజం విఠలాచార్య ఆయనలో ఉన్న ప్రత్యేకతను గుర్తించి ఒక కీలకమైన సలహా ఇచ్చారు. “హీరోలుగా పోటీ ఎక్కువ, నీకు నేపథ్యం లేదు. కానీ విలన్ల కొరత ఉంది. ఆర్. నాగేశ్వరరావు గారు లేరు, రాజనాల గారు ఒక్కరే ఉన్నారు, ముక్కామల గారికి వయసు మీద పడింది. నువ్వు విలన్ గా మారితే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు” అని విఠలాచార్య గారు సత్యనారాయణకు సూచించారు. ఆయన సలహాను స్వీకరించి, విఠలాచార్య స్వయంగా తన కనక దుర్గ పూజ మహిమ చిత్రంలో మొదటి విలన్ అవకాశాన్ని కల్పించారు.





