
Harish Rao | రియల్ ఎస్టేట్ ఒక పెద్ద వ్యాపారం. రియల్ ఎస్టేట్ బాగుంటే దానికి అనుబంధంగా ఎన్నో రంగాలు బాగుంటాయి. రియల్ ఎస్టేట్ రంగం బాగా నడిస్తే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతుందని, అలాగే...
Harish Rao | రియల్ ఎస్టేట్ ఒక పెద్ద వ్యాపారం. రియల్ ఎస్టేట్ బాగుంటే దానికి అనుబంధంగా ఎన్నో రంగాలు బాగుంటాయి. రియల్ ఎస్టేట్ రంగం బాగా నడిస్తే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతుందని, అలాగే సిమెంట్, స్టీల్, టైల్స్, శానిటరీ, మార్బుల్స్ వంటి అనేక రంగాలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. సిద్దిపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. వందలాది వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. మీరందరూ ఇంతకుముందు ఎంత ఉత్సాహంగా ఉండేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని, దాని ప్రభావంతో చిన్న వ్యాపారాలు, టీ హోటళ్లు, దుకాణాలు, ఇతర అనుబంధ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. ఇది ఒక్క సిద్దిపేట పరిస్థితి కాదు. రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉందన్నారు.
హైదరాబాద్లో చూసినా ఇదే, కరీంనగర్లో చూసినా ఇదే, నల్గొండలో చూసినా ఇదే, మహబూబ్నగర్లో చూసినా ఇదే, నిజామాబాద్లో చూసినా ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దుకాణాలు నడవడం లేదు. షాపులకు గిరాకీ లేదు. వ్యాపారం పూర్తిగా దెబ్బతిందన్నారు హరీశ్ రావు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులతో వాహనాల ఈఎంఐలు కూడా చెల్లించలేక, ఫైనాన్స్ సంస్థలు వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నాయన్నారు. కుటుంబాలు పిల్లల ఫీజులు చెల్లించలేక, కొందరు పట్టణాలు వదిలి గ్రామాలకు వెళ్లి వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చింది.
అంటే జీవితమే రివర్స్ అయిపోయింది. ప్రభుత్వాలు మారొచ్చు. కానీ అభివృద్ధి ఆగకూడదు. వ్యాపారాలు దెబ్బతినకూడదు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. కానీ ప్రస్తుత ప్రభుత్వం కొత్త కొత్త నిబంధనలతో వ్యాపారాలకు ఇబ్బందులు సృష్టించిందని దురదృష్టవశాత్తు, ఒకవైపు హైడ్రా చర్యలు, మరోవైపు ప్రతికూల దృక్పథం, రకరకాల నియమ నిబంధనల పేరుతో వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీశారు.
కొన్ని ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి.. సిద్ధిపేటలో అన్ని దిక్కులా సమాన అభివృద్ధి కోసం కలెక్టరేట్, నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ, కేంద్రీయ విద్యాలయం, రైల్వే స్టేషన్ వంటి సంస్థలను తీసుకొచ్చామని వివరించారు. రంగనాయక సాగర్ వద్ద పర్యాటక అభివృద్ధి కోసం డెస్టినేషన్ సెంటర్, బోట్ హౌస్లు, గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేసినా, ప్రభుత్వం మారడంతో ఆ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు.
అలాగే వెటర్నరీ కాలేజీ (BVSc), వ్యవసాయ కళాశాల, మెడికల్ కాలేజీ వంటి విద్యాసంస్థల ద్వారా సిద్ధిపేటను అన్ని రకాల ఉన్నత విద్యకు కేంద్రంగా తీర్చిదిద్దామని, కానీ కొన్ని ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయని పేర్కొన్నారు. సిద్దిపేటకి రేవంత్ రెడ్డి అనే గ్రహణం పట్టింది. ఆ గ్రహణానికి మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇంకో రెండు సంవత్సరాలు ఆ గ్రహణం ఉంటుంది. ఆ రెండు సంవత్సరాలు ఓపిక పడితే తప్పకుండా మళ్లీ మనకు మంచి రోజులు వస్తాయి. ఏ మాత్రం అధైర్యపడొద్దు. తప్పకుండా మళ్లీ మంచి రోజులు వస్తాయి.
దానికోసం మీరందరూ ధైర్యంగా ఉండండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎక్కడా అధైర్యపడకండి. భవిష్యత్తు లేదు అని ఎవరూ నిరాశ చెందకండి. ఏదీ శాశ్వతం కాదు కదా. గ్రహణం కూడా కొంతసేపే ఉంటుంది, తర్వాత తొలగిపోతుంది. మన దగ్గర కూడా శని దశ నడుస్తోంది సార్ అంటుంటారు. ప్రతి మనిషికి కొంతకాలం శని దశ వస్తుంది. శని పోయిన తర్వాత గురు దశ వస్తుంది. అలాగే మనకు కూడా ఈరోజు గ్రహణం పట్టినట్టే ఉంది. కానీ తప్పకుండా మళ్లీ గురు దశ వస్తుందని హరీశ్ రావు భరోసానిచ్చారు.