
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Kaleshwaram Project: ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది. ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మరో పోరాటానికి గులాబీ పార్టీ సిద్ధమైంది. కేసీఆర్ మీద కక్షతోనే కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు ఎత్తిపోయకపోవడంతో రేపు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన కన్నెపల్లి పంప్హౌస్ను సందర్శించనుండడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్ హౌజ్ మోటార్లు వెంటనే ఆన్ చేయాల్సిందేనని ఈ పర్యటనతో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పనుంది. వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ వృథాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోయాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దునిద్ర వీడడంపై గులాబీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి రైతులకు ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. గోదావరి జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నా కాంగ్రెస్ సర్కార్ నీళ్లు ఎత్తిపోయకపోవడాన్ని రేపు బీఆర్ఎస్ పార్టీ ఎండగట్టనుంది.
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై రేపు జూలై 5వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ బృందం సందర్శించనుంది. మంథని నియోజకవర్గంలోని కన్నెపల్లి వద్ద వృథాగా పోతున్న జలాలను బీఆర్ఎస్ బృందం పరిశీలించనుంది. ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం వలన గోదావరి బేసిన్లో కేవలం 23 శాతం మాత్రమే రిజర్వాయర్లు నిండి ఉండడంతో రైతులకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడనుంది.
ఇంజనీర్ల ఆందోళన 'ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర గోదావరిలో 15 వేల క్యూసెక్కులు దాటి ప్రవాహం నమోదవుతోంది. రానున్న రోజుల్లో ప్రవాహాలు 60 వేల క్యూసెక్కులకు పైగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మేడిగడ్డ బరాజ్పై ఆధారపడకుండా కన్నెపల్లి (లక్ష్మీ) పంప్హౌజ్ దగ్గర నీటిని మళ్లించి.. పంపింగ్ చేపట్టే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కన్నెపల్లి పంప్హౌజ్ మోటార్లు ఆన్ చేస్తే గోదావరిలో ప్రస్తుతం లభిస్తున్న ప్రవాహాన్ని వాడుకొని వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు నీరు అందించే మార్గం ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు' అని బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. ఇదే విషయాన్ని చెప్పేందుకు.. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే రేపు కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కన్నెపల్లి పంప్హౌజ్ను సందర్శించనుంది. ఈ పర్యటనకు పెద్ద ఎత్తున ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తరలివెళ్లే అవకాశం ఉంది. కన్నెపల్లి పంపుహౌస్ సందర్శనకు బీఆర్ఎస్ పార్టీ వెళ్తుండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తమైందని తెలుస్తోంది.