
ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, అరెస్టుల వ్యవహారాలపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్న రావణ్ అరెస్టు ఉదంతంపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు.
ప్రత్యేకించి.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ఆయన టార్గెట్ గా చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో షేర్ చేశారు. నవ్వుతూనే ఆయన చురకలు అంటించారు.
పవన్ కల్యాణ్ సహా ముఖ్యమంత్రి చంద్రబాబు, రాధా మనోహర్ దాస్లపై ఇదివరకు రావణ్ ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రయోగించిన కొన్ని పదాలు వివాదాస్పదంగా మారడం.. అరెస్టుకు దారి తీసింది. పోలీసులు ఆయనను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఆయనకు బెయిల్ లభించినప్పటికీ.. అదే కేసులో రావణ్ మళ్లీ మళ్లీ వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో అరెస్ట్ అయినా బెయిల్ పై విడుదల అవుతున్నారు.
దీన్ని ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. ఈ కేసులో రావణ్ ను రిమాండ్ కు పంపించలేమంటూ వేర్వేరు న్యాయస్థానాలు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తోన్నప్పటికీ.. అదే కేసులో పదే పదే పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడంలో అర్థం లేదని అన్నారు. చట్టం ప్రకారం అరెస్టు చెల్లదంటూ కోర్టు బెయిల్ మంజూరు చేసినా కూడా మళ్లీ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రకాష్ రాజ్ నిలదీశారు. ప్రతీసారి కోర్టులు తప్పుబడుతున్నా కూడా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవట్లేదని అన్నారు.
అర్ధరాత్రి ఆయనను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి, పెద్ద బిల్డప్ ఇచ్చి ఏపీకి తీసుకెళ్లారని, ఈ కేసులో అరెస్ట్ చేయకూడదని కోర్టు బెయిల్ ఇచ్చిందని, ఆ వెంటనే మరో కేసు పెట్టి మళ్లీ అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. అప్పుడు కూడా కోర్టు బెయిల్ ఇచ్చిందని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.
కోర్టు బెయిల్ ఇస్తోన్నా కూడా ఇలా రావణ్ పై 30-35 కేసులు పెట్టి ఏపీ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ప్రకాష్ రాజ్ విమర్శించారు. ఇలా ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటీ సిగ్గులేని కక్షసాధింపు?, ఏం చేయాలనుకుంటున్నారు.. అని నిలదీశారు. ప్రజలు ఏపీ ప్రభుత్వ పనితీరును చూస్తోన్నారని, ఫ్రస్ట్రేషన్ ను గమనిస్తోన్నారని ప్రకాష్ రాజ్ చెప్పారు. ఎవరైనా గానీ అధికారాన్ని ఇలా దుర్వినియోగం చేయలేరని అన్నారు. దీన్ని నుంచి త్వరలోనే రియలైజ్ అవుతారని ఆశిస్తున్నానేని అన్నారు.