
Rare Records : ఫాస్టెస్ట్ ఫార్మాట్ అయిన అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఒక్క ఓవర్ లేదా కొన్ని బంతుల్లో చేసే మెరుపు ప్రదర్శన కూడా ఒక ఆటగాడిని రాత్రికి రాత్రే హీరోగా మార్చేస్తుంది.
కొన్నిసార్లు కేవలం 20-30 పరుగులు చేసినా లేదా రెండు కీలక వికెట్లు తీసినా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కుతుంటాయి. అయితే, ప్రపంచ క్రికెట్లో ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు, వారు తమ దేశాల తరఫున ఎన్నో ఏళ్ల పాటు విజయవంతమైన కెరీర్ను సాగించారు. ఎన్నో మ్యాచ్లను ఒంటిచేత్తో గెలిపించారు. కానీ, తమ సుదీర్ఘ టీ20 కెరీర్లో ఒక్కసారి కూడా ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోలేకపోయారు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అలా అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క అవార్డు కూడా గెలవని ఐదుగురు ప్రముఖ ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
ఈ జాబితాలో అందరినీ అత్యంత ఎక్కువగా ఆశ్చర్యపరిచే పేరు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఎంఎస్ ధోనీ సారథ్యంలోనే టీమిండియా 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ టైటిల్ను ముద్దాడింది. ధోనీ భారత్ తరఫున ఏకంగా 98 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడాడు. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు వస్తూ ఎన్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్లలో భారత్ను గెలిపించాడు. వికెట్ కీపర్గా మెరుపు స్టంపింగ్స్తో రికార్డులు సృష్టించాడు. ఇంతటి అద్భుతమైన, సుదీర్ఘమైన కెరీర్ ఉన్నప్పటికీ, ధోనీ తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఒక్కసారి కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకోలేకపోవడం నిజంగా ఒక వింతైన రికార్డు అనే చెప్పాలి.
ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్, టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రపంచంలోనే అత్యుత్తమ మ్యాచ్ విన్నర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ గెలవడానికి స్టోక్స్ ఆడిన ఇన్నింగ్స్లే కారణం. ఆయన తన టీ20 కెరీర్లో 43 మ్యాచ్లు ఆడి 585 పరుగులు చేయడంతో పాటు 26 వికెట్లు పడగొట్టాడు. అంతటి గొప్ప ఆల్రౌండ్ ప్రదర్శన ఉన్నప్పటికీ, ఆయన ఖాతాలో ఒక్క టీ20 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లేదు.
దినేష్ రామ్దిన్ ఖాతాలో లేని ఆ ఒక్క అవార్డు
అలాగే వెస్టిండీస్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ రామ్దిన్ 2006 నుంచి 2019 మధ్య కాలంలో 71 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడాడు. విండీస్ జట్టు 2012 మరియు 2016 లో టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆయన జట్టులో కీలక సభ్యుడు. అయితే, రామ్దిన్ కూడా తన కెరీర్లో ఈ అవార్డును ఒక్కసారి కూడా అందుకోలేకపోయాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఆఫ్ఘనిస్తాన్ మాజీ సారథి అస్గర్ అఫ్గాన్ ఒకరు. ఆయన నాయకత్వంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆడిన 52 మ్యాచ్లలో ఏకంగా 42 పోటీల్లో విజయం సాధించి రికార్డు సృష్టించింది. అస్గర్ అఫ్గాన్ తన కెరీర్లో మొత్తం 75 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడి జట్టు ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాడు. అయితే, కెప్టెన్గా జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించినప్పటికీ, వ్యక్తిగతంగా ఆయనకు ఒక్క మ్యాచ్లో కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించలేదు.
ఐర్లాండ్ మాజీ కెప్టెన్ విలియం పోర్టర్ఫీల్డ్
ఐర్లాండ్ క్రికెట్ను ప్రాథమిక స్థాయి నుంచి పైకి తీసుకురావడంలో ఆ దేశ మాజీ కెప్టెన్, లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ విలియం పోర్టర్ఫీల్డ్ పాత్ర ఎంతో ఉంది. ఆయన 2008 నుంచి 2018 మధ్య కాలంలో ఐర్లాండ్ తరఫున 61 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడాడు. ఓపెనర్గా రాణిస్తూ 1,079 పరుగులు సాధించాడు. జట్టును ఎన్నో మ్యాచ్లలో ముందుండి నడిపించినప్పటికీ, విలియం పోర్టర్ఫీల్డ్ పేరు మీద కూడా అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా నమోదు కాలేదు. క్రికెట్ అనేది ఒక టీమ్ గేమ్ అని, వ్యక్తిగత అవార్డుల కంటే జట్టు విజయమే ముఖ్యమని ఈ ఐదుగురు ఆటగాళ్ల కెరీర్లను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి