
హిమగిరులలో కొలువైన మంచులింగాన్ని దర్శించుకొనేందుకు చేపట్టే అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్ క్షేత్ర వార్షిక యాత్ర కట్టుదిట్టమైన భద్రత నడుమ షరూ అయ్యింది.
దేశం నలుమూలల నుండి వచ్చిన వేలాది మంది భక్తులు బమ్ బమ్ భోలే , హర్ హర్ మహాదేవ్ నినాదాలతో హిమగిరులు మార్మోగాయి. అదలా ఉండగా.. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర 57 రోజుల సాగనుంది. శుక్రవారం (జులై 3) ప్రారంభమైన ఈ యాత్ర రాబోయే వచ్చే నెల 28 వరకు కొనసాగుతుంది.
ఈ యాత్రను విజయవంతం చేయడానికీ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటానికి అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. జమ్మూకశ్మీర్లోని గందర్బల్ జిల్లా బల్తాల్ బేస్ క్యాంప్, అనంతనాగ్ జిల్లా నున్వాన్-పహల్గాం బేస్ క్యాంపుల నుండి యాత్రికుల తొలి బృందాలు కట్టుదిట్టమైన రక్షణ వలయం మధ్య అమర్ నాథ్ యాత్ర ప్రారంభించారు. సముద్ర మట్టానికి 3 వేల 880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహను చేరుకోవడానికి భక్తులు బల్తాల్, పహల్గాం మార్గాలలో ఏదో ఒక దానిలో వెడతారు. భక్తులు తమ వీలును బట్టి ఈ రెండింటిలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని మంచు శివలింగ దర్శనం కోసం వెడతారు.
భక్తుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం.. జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ , భారత సైన్యంతో కలిసి అత్యంత పటిష్టమైన మూడంచెల రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసింది. అమర్నాథ్జీ పుణ్యక్షేత్ర మండలి ఆధ్వర్యంలో మునుపెన్నడూ లేని విధంగా డిజిటల్ నిఘాను పెంచారు. ప్రతి యాత్రికుడి కదలికలను నిరంతరం పర్యవేక్షించడానికి ఆధునిక ఆర్ఎఫ్ఐడీ ట్రాకింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా యాత్రా మార్గాలను నో-ఫ్లై జోన్లుగా ప్రకటించారు. అలాగే అత్యవసర వైద్య సేవలు అందించడానికి సమగ్ర ఆరోగ్య ప్రోటోకాల్స్ను, ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించారు.
Teluguone, Amarnath Yatra, Baltal Base Camp, Pahalgam Route,, Jammu Kashmir
.