Telangana Cabinet VBG Ramji Act : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం నాడు సచివాలయంలో జరిగిన రాష్ట్ర తొలి డిజిటల్ క్యాబినేట్ సమావేశం పలు చారిత్రాత్మక, వ్యూహాత్మక నిర్ణయాలకు వేదిక...
Telangana Cabinet VBG Ramji Act : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం నాడు సచివాలయంలో జరిగిన రాష్ట్ర తొలి డిజిటల్ క్యాబినేట్ సమావేశం పలు చారిత్రాత్మక, వ్యూహాత్మక నిర్ణయాలకు వేదిక అయింది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ప్రవేశ పెట్టిన ‘వీబీ-జీ రామ్ జీ’ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూనే.. అందులోని కొన్ని నిబంధనలపై సుప్రీం కోర్టులో లీగల్ బ్యాటిల్ చేయాలని మంత్రివర్గం సంచలన తీర్మానం చేసింది. ఈ చట్టం జూలై 1వ తేదీ నుంచి తెలంగాణలో అమల్లోకి రానుంది.నిరసనల మధ్యే ‘వీబీ-జీ రామ్ జీ’కి గ్రీన్ సిగ్నల్.. ఎందుకంటే?క్యాబినేట్ భేటీ అనంతరం సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాష్ట్రాలను సంప్రదించకుండా, కనీసం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ చట్టాన్ని రుద్దడం పట్ల క్యాబినేట్ తీవ్ర నిరసన తెలిపింది. గ్రామీణ కూలీల ఉపాధి భద్రతకు సంబంధించిన ‘ఉపాధి హామీ పథకం’ (ఎంజీఎన్ఐర్ఈజీఎస్) లో మార్పులు చేయవద్దని ఈ ఏడాది జనవరిలోనే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని క్యాబినేట్ గుర్తు చేసింది.నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని క్యాబినేట్ సబ్-కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఈ కొత్త పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడటమే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందని నిర్ధారించారు. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలు దీనిని అంగీకరించినందున.. తెలంగాణలో ఉపాధి కూలీలకు అవకాశాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో దీనికి ఆమోదం తెలపాల్సి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేంద్రంపై పార్లమెంట్లో ఒత్తిడి తెస్తూనే.. సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సర్కార్ డిసైడ్ అయింది.క్యాబినేట్ తీసుకున్న మిగతా నిర్ణయాలివే..!ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రజా సంక్షేమ, అభివృద్ధి రంగాలకు సంబంధించి మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.7,345 కోట్ల అంచనా వ్యయంతో మూసీ నది మొదటి దశ పునరుద్ధరణ పనులకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులతో పాటు అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇతర సిబ్బంది అందరికీ ఉచితంగా అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం అందించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా హెల్త్ సెక్టార్ను బలోపేతం చేస్తూ.. టిమ్స్ (TIMS) వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఏకంగా 6,278 కొత్త పోస్టుల భర్తీకి కేబినెట్ అనుమతి ఇచ్చింది.