పవిత్రమైన అమర్నాథ్ యాత్ర భంభంభోలే నినాదాలతో మొదలైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అమర్నాథ్ యాత్ర శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభమైంది.
జమ్మూకశ్మీర్లోని దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహకు తొలి విడత భక్తులు బాల్తాల్, నువ్వాన్ బేస్ క్యాంపుల నుంచి బయల్దేరారు. సహజసిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని భక్తులు దర్శించుకుంటారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర మొత్తం 57 రోజుల పాటు సాగనుంది. జూలై 3న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 28న ముగియనుంది. యాత్ర సాఫీగా సాగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. భక్తులు రెండు మార్గాల ద్వారా అమర్నాథ్ గుహకు చేరుకుంటారు. అందులో ఒకటి 48 కిలోమీటర్ల నున్వాన్ - పహల్గామ్ మార్గం, మరొకటి 14 కిలోమీటర్ల బాల్తాల్ మార్గం ద్వారా యాత్ర కొనసాగుతోంది. అనంత్నాగ్ జిల్లాలోని నున్వాన్ బేస్ క్యాంప్, గందర్బల్ జిల్లాలోని సోనమార్గ్ సమీపంలోని బాల్తాల్ బేస్ క్యాంప్ నుంచి పెద్ద సంఖ్యలో యాత్రను ప్రారంభించారు. ఆయా జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్లు తొలి బృందాలకు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. READ ALSO ఇరాన్ నేతల హత్యలకు ఇజ్రాయెల్ ప్లాన్? ముందే వార్నింగ్ ఇచ్చి ప్రాణాలు కాపాడిన అమెరికా.. బయటపడ్డ అసలు నిజాలు!జమ్మూలోని భగవతి నగర్ యాత్ర బేస్ క్యాంప్ నుంచి గురువారం 4809 మంది భక్తులతో కూడిన తొలి బృందాన్ని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి భక్తులను పంపించారు. ఈ బృందం మధ్యాహ్నానికి కశ్మీర్ లోయకు చేరుకోగా.. స్థానిక ప్రజలు, అధికారులు స్వాగతం పలికారు. అమర్నాథ్ యాత్రను దృష్టిలో ఉంచుకుని వేలాది మంది జమ్మూకశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇతర పారామిలటరీ బలగాలను కూడా భారత ప్రభుత్వం మోహరించింది. యాత్ర మార్గాలపై డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా నిఘా కూడా ఉండనుంది. భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ.. అన్ని మార్గాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మహిళలు కూడా ఈ యాత్రలో అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం.