
మన దేశంలో ఏటా కోటికి పైగా యువత డిగ్రీలు పూర్తి చేస్తున్నా, వారిలో 50 శాతానికి పైగా మందిలో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు ఉండటం లేదని శ్రీసిటీ చైర్మన్ శ్రీనిరాజు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నైపుణ్యాల కొరత కారణంగా 18-22 ఏళ్ల మధ్య వయసున్న యువత నుంచి ఉత్పాదకత కొరవడుతోందని ఆయన అన్నారు. తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఏర్పాటు చేసిన శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ (ఎస్ఐయూ) ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.పట్టభద్రుల్లో 95 శాతం మంది సరైన మార్గనిర్దేశం, సహకారం కోరుకుంటున్నారని శ్రీనిరాజు తెలిపారు. ఈ నైపుణ్యాల అంతరాన్ని (స్కిల్ గ్యాప్) పూడ్చేందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో శ్రీసిటీ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. "ముఖ్యమంత్రి చంద్రబాబు గ్యారంటీ ఉపాధి కల్పించాలని మాకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగానే సింగపూర్, కెనడా, జర్మనీ వంటి దేశాల్లో అమలవుతున్న వర్క్-స్టడీ మోడల్లో ఈ వర్సిటీని తీర్చిదిద్దాం" అని వివరించారు. వర్సిటీలో ఇంక్యుబేషన్, ఇన్నొవేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రవీణ్ అక్కిరాజు తదితరులు పాల్గొన్నారు. కార్నెగి మెలాన్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ రాజారెడ్డి, కేంద్ర మాజీ వాణిజ్య కార్యదర్శి జీకే పిళ్లై పంపిన సందేశాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు.