
జపాన్ ప్రధాని సనాయె తకాయిచీ భారత్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీ రెండు దేశాల వ్యూహాత్మక సంబంధాలకు కొత్త దిశను చూపించింది.
జపాన్‌ ప్రధాని సనాయె తకాయిచీ భారత్‌ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీ రెండు దేశాల వ్యూహాత్మక సంబంధాలకు కొత్త దిశను చూపించింది. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన సమావేశంలో పెట్టుబడులు, రక్షణ, ఫార్మా, కృత్రిమ మేధస్సు వంటి కీలక రంగాలపై రెండు పక్షాలు చర్చించాయి.భారత్‌-జపాన్‌ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం తకాయిచీ మొదటిసారి భారత్‌కు వచ్చారు. ఆమెను స్వాగతిస్తూ మోదీ ఆప్యాయంగా “నా అందమైన సోదరి” అని పేర్కొన్నారు. దీనికి చిరునవ్వుతో స్పందించిన తకాయిచీ, తనను అలా సంబోధించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. జపాన్‌కు తొలి మహిళా ప్రధానిగా ఆమె బాధ్యతలు చేపట్టిన విషయాన్ని కూడా మోదీ ప్రస్తావించారు.భారత్‌-జపాన్‌ ఒప్పందాల్లో పెట్టుబడులే కీలకంవచ్చే పదేళ్లలో భారత్‌లో సుమారు రూ.6 లక్షల కోట్ల జపాన్‌ పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకుని ఇరుదేశాలు ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫార్మా, రక్షణ తయారీ, ఏఐ టెక్నాలజీ, వాణిజ్యం, మౌలిక వసతులు వంటి రంగాల్లో సహకారం పెంచే అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. జపాన్‌ టెక్నాలజీ, భారత్‌ మార్కెట్‌ సామర్థ్యం కలిస్తే రెండు దేశాలకూ ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.16వ ఇండియా-జపాన్‌ వార్షిక సదస్సులో పాల్గొన్న ఇద్దరు ప్రధానులు, ప్రత్యేక వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, ఆర్థిక సమృద్ధి కోసం కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని మోదీ గుర్తుచేశారు.తకాయిచీ బుధవారం మూడు రోజుల పర్యటనకు భారత్‌ చేరుకున్నారు. భారత్‌లో అడుగుపెట్టిన అనంతరం ఆమె ఎక్స్‌’లో ఫొటోను పంచుకున్నారు. దానికి స్పందించిన మోదీ, తొలి భారత్‌ పర్యటన సందర్భంగా ఆమెకు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య రాజకీయ విశ్వాసం మాత్రమే కాకుండా, ఆర్థిక సహకారానికి కూడా కొత్త ఊపు లభించే అవకాశం ఉంది.