
ఆంధ్రప్రదేశ్ మరో చారిత్రక ఘట్టానికి వేదికైంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్’ (వీబీ జీ రామ్ జీ) ఏపీ నుంచే ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి...
ఆంధ్రప్రదేశ్ మరో చారిత్రక ఘట్టానికి వేదికైంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్’ (వీబీ జీ రామ్ జీ) ఏపీ నుంచే ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ బృహత్తర పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ముక్కవారిపల్లి గ్రామంలో రూ.4.55 లక్షల వ్యయంతో ప్రతిపాదించిన మూడు పనులకు నేతలు శ్రీకారం చుట్టారు. సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రెయిన్, మొక్కల పెంపకం కార్యక్రమాలను వీబీ జీ రామ్ జీ మిషన్ కింద తొలి పనులుగా ప్రారంభించారు. అనంతరం స్థానిక లబ్ధిదారులకు కేంద్ర మంత్రి, సీఎం, డిప్యూటీ సీఎం కలిసి జాబ్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్ కలిసి పథకం ప్రోత్సాహక గీతాన్ని ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పథకానికి సంబంధించిన సమాచార బుక్లెట్ను, ఇతర ప్రచురణలను విడుదల చేయగా, నేతలంతా కలిసి పథకం అధికారిక పోర్టల్ను ప్రారంభించారు.