
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు.
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాళెం సమీపంలో హీరో మోటోకార్ప్ సంస్థ రూ.750 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్ (Global Parts Center) 2.0 (జీపీసీ2.0) కు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్లాంటు ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూస్తామన్నారు. దీన్ని త్వరితగతిన పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. హీరో వ్యవస్థాపక చైర్మన్ బ్రిజ్ మోహన్లాల్ ముంజాల్ (Brijmohan Lall Munjal) పారిశ్రామికవేత్తే కాదని, జాతి నిర్మాణానికి సహకరించిన మహనీయుడని కొనియాడారు. హీరో మోటోకార్ప్ వేరే రాష్ట్రంలో ప్లాంటు పెట్టాలని భావిస్తే, వారితో ప్రత్యేకంగా చర్చించి ఏపీలో ఏర్పాటు చేయాలని ఒప్పించానని గుర్తుచేశారు. 2018 లో తిరుపతి (Tirupati)లో శంకుస్థాపన చేసిన హీరో ప్లాంటు, ఇప్పుడు పెద్ద ఎత్తున వాహనాలను ఉత్పత్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. హీరో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్ చెప్పిన విధంగా రూ.3,200 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులు కూడా త్వరలోనే ప్రారంభించాలని కోరారు.
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో రోడ్డు, రైలు, విమాన, ఓడల కనెక్టివిటీ అద్భుతంగా ఉంది. అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నాం అనడానికి అమరావతే నిదర్శనం. రాష్ట్రంలో మహిళలు కష్టపడి పనిచేస్తారు.త్వరగా నైపుణ్యాలు నేర్చుకుంటారు. హీరో ప్లాంట్లో 40 శాతం మంది మహిళలే పనిచేస్తుడటం గర్వకారణం అని చంద్రబాబు పేర్కొన్నారు.