
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ సూపర్ కూల్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
జూలై 8వ తేదీ వరకు రెండు రాష్ట్రాల్లోనూ విస్తారంగా, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. దీంతోపాటు నైరుతి రుతుపవనాలు కూడా ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేశాయని పేర్కొంది.
ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని శుక్రవారం నాటికి బంగాళాఖాతంలో ఒక బలమైన అల్పపీడనం ఏర్పడబోతోంది. ఇది క్రమంగా రాజస్థాన్ వైపు పయనిస్తుందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. దీని ఎఫెక్ట్ వల్ల జూలై 4 నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడా వానలు స్టార్ట్ అయ్యి, జూలై 5 నాటికి రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలకు విస్తరిస్తాయి. ముఖ్యంగా జూలై 5వ తేదీన వాతావరణం మరింత క్రేజీగా మారబోతోంది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు దాదాపు అన్ని జిల్లాలను ఈదురుగాలులు, వర్షాలు వణికించే ఛాన్స్ ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా రానున్న వారం రోజుల పాటు వాతావరణంలో పెను మార్పులు రానున్నాయి. జూలై 8 వరకు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తుపాను గాలులు వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. మొదటి రెండు రోజులు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై వరుణుడు తీవ్ర ప్రతాపం చూపించనున్నాడు.
ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. జూలై 3న జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఈదురుగాలుల బీభత్సం ఎక్కువగా ఉంటుంది.
హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల ప్రజలు కూడా ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సిటీలో ఆకాశం పూర్తిగా నల్లటి మేఘాలతో కమ్మేసి, ఎప్పుడైనా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడొచ్చు. హైదరాబాద్ ప్రజలు ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల జనం జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ను కూడా వానలు ముంచెత్తనున్నాయి. గురువారం శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. జూలై 4 నుంచి వర్షాల తీవ్రత పెరిగి, రాయలసీమ సహా ఏపీలోని మెజారిటీ ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురుస్తాయి.
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిల్చోవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.