
ఇంటర్నెట్ డెస్క్: మాఫియా, ప్రతీకార నేపథ్యం, కుటుంబ అంశాల మేళవింపుగా రూపొంది ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న చిత్రం ‘జైలర్’.
అగ్ర కథానాయకుడు రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే. తాజాగా ‘జైలర్ 2’ (Jailer 2) షూటింగ్ పూర్తయినట్లు టీమ్ తెలిపింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది ఏప్రిల్లోనే పూర్తయింది. కానీ, నెల్సన్ ఈ కథలో మరికొన్ని కొత్త సన్నివేశాలు యాడ్ చేసి 25 రోజుల పాటు మళ్లీ షూటింగ్ నిర్వహించారు. తాజాగా అవి కూడా పూర్తయినట్లు చిత్రబృందం పేర్కొంది.
ఈ చిత్రంలో హృతిక్ రోషన్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆయన చెన్నై రావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ 25 రోజుల షెడ్యూల్లో ఆయనకు సంబంధించిన సన్నివేశాలనే చిత్రీకరించారని సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘జైలర్’లో పలు భాషలకు చెందిన అగ్రతారలు అతిథి పాత్రల్లో మెరిసిన విషయం తెలిసిందే. రెండో భాగంలోనూ ఆ సందడి కొనసాగనుంది. సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కూడా ఇందులో కీలకపాత్రలో కనిపించనున్నారు. మొదటి భాగం ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే సీక్వెల్ ప్రారంభమవుతుందని గతంలో శివరాజ్ కుమార్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.