
మహిళల హక్కులు, వ్యక్తిగత చట్టాల దుర్వినియోగంపై అలహాబాద్ హైకోర్టు అత్యంత కీలకమైన, సంచలన వ్యాఖ్యలు చేసింది. నికాహ్, హలాలా, ట్రిపుల్ తలాక్ వంటి ఆచారాల ముసుగులో మహిళలను లైంగికంగా వేధించడాన్ని ఎంత మాత్రం...
మహిళల హక్కులు, వ్యక్తిగత చట్టాల దుర్వినియోగంపై అలహాబాద్ హైకోర్టు అత్యంత కీలకమైన, సంచలన వ్యాఖ్యలు చేసింది. నికాహ్, హలాలా, ట్రిపుల్ తలాక్ వంటి ఆచారాల ముసుగులో మహిళలను లైంగికంగా వేధించడాన్ని ఎంత మాత్రం అనుమతించబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇలాంటి పద్ధతులు సమాజానికి నల్లటి పేజీలు లాంటివని.. ఇవి రాజ్యాంగ విలువలకు, సమానత్వానికి, మానవ గౌరవానికి పూర్తిగా విరుద్ధమని న్యాయస్థానం అభివర్ణించింది. ఇటువంటి చర్యలు చట్టప్రకారం నేరం మాత్రమే కాకుండా.. సమాజ మనస్సాక్షిని కదిలించేవని పేర్కొంది.జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాలతో కూడిన ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో బాధితురాలి మాజీ భర్త, ఆమె మామ, మౌలానాతో పాటు ఇతర నిందితులు తమపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని.. అరెస్టును నిలిపివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. నేరపూరిత చట్టాలు అమల్లోకి వచ్చినప్పుడు.. వ్యక్తిగత చట్టాల సాకుతో నేరాలకు రక్షణ కల్పించడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఇది ఓ మైనర్ బాలిక‌పై పక్కా ప్రణాళికతో జరిగిన సామూహిక అత్యాచారంగా భావిస్తూ.. దీనిపై లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.ఈ వివాదాస్పద ఉదంతం యూపీలోని అమ్రోహా జిల్లా సైద్నాగలి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బాధితురాలు చిన్న వయస్సులో ఆమెకు నికాహ్ చేయడం.. ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ చెప్పడం.. మళ్లీ హలాలా పేరుతో తిరిగి నికాహ్ చేసుకునే క్రమంలో నిరంతరం లైంగిక వేధింపులకు గురిచేశారంటూ నిందితులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నిందితులు తమపై ఉన్న కేసులను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వాస్తవాలు చాలా తీవ్రమైనవని, దర్యాప్తు ప్రారంభ దశలో ఉన్నందున ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయడానికి ఎలాంటి ఆధారం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడే ఆమెపై అత్యాచారం జరిగిందని.. ఆ తర్వాత హలాలా పేరుతో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి.. ఆ నేరాన్ని దాచేందుకు ప్రయత్నించారని ఆరోపణల ద్వారా స్పష్టమవుతోందని న్యాయస్థానం పేర్కొంది. క్రిమినల్ లా విషయానికి వస్తే.. చట్టం స్వయంగా ఏదైనా మినహాయింపు ఇస్తే తప్ప, వివాహాలను నియంత్రించే వ్యక్తిగత చట్టాలను సాకుగా చూపి నేరాల నుంచి తప్పించుకునే అవకాశం లేదు అని హైకోర్టు గట్టిగా బదులిచ్చింది. అందువల్ల ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిందేనని, రిట్ పరిధిని ఉపయోగించి కేసులను ప్రారంభంలోనే క్లోజ్ చేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.