
YS Jagan Mohan Reddy : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటికే అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇటీవల అమరావతి రాజధానికి ప్రత్యామ్నాయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మావిగన్ (MAVIGUN) అనే నూతన రాజధాని కారిడార్ను ప్రతిపాదించారు. ఇదే అంశంపై జగన్ మోహన్ తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.
వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ‘మావిగన్ వర్సెస్ అమరావతి’ అనే అజెండాతోనే జరుగుతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మావిగన్ (MAVIGAN) అజెండాపై తమ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని జగన్ స్పష్టం చేశారు. ఇదే తమ ఎన్నికల నినాదమని, ప్రజల ముందుకు కూడా ఇదే అంశంతో వెళ్తామని తెలిపారు.
మావిగన్కు మేము కట్టుబడి ఉన్నాం. ప్రజలకు మా వైఖరిని వివరిస్తాం. మాకు మద్దతు ఇచ్చే ప్రజలు మాకే ఓటు వేస్తారు. ప్రజల మద్దతు ఎవరికుందో ఎన్నికల్లో తేలిపోతుంది అని జగన్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో అమరావతి మోడలా? లేక మావిగన్ అజెండానా? అనే అంశంపైనే ప్రజలు తీర్పు ఇవ్వనున్నారని ఆయన అన్నారు. ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారని, ఎన్నికల్లో ఎవరి విధానానికి ప్రజలు మద్దతు ఇస్తారో స్పష్టమవుతుందని వ్యాఖ్యానించారు.
జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరోసారి రాజధాని అంశంపై చర్చకు దారితీశాయి. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో అమరావతి అభివృద్ధి, మావిగన్ అజెండా ప్రధాన రాజకీయ చర్చాంశాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.