
YS Jagan: ఆంధ్రప్రదేశ్లో చట్టవ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
గతంలో రాష్ట్ర అభివృద్ధిపై చర్చ జరిగేదని, ఇప్పుడు మాత్రం “రెడ్బుక్ రాజ్యాంగం”, పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న లాకప్ మరణాలపై చర్చ జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్కు వెళ్లాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారి గొంతులు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విభేదించే స్వరాలను అణచివేస్తున్నారని జగన్ ఆరోపించారు. విజయవాడ సాయికృష్ణ కేసు, క్రాంతికుమార్ ఆత్మహత్య, కర్నూలు గంగమ్మ ఘటన వంటి సంఘటనలు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు.
సాయికృష్ణ కేసును ప్రస్తావిస్తూ, కస్టడీలో ఒక వ్యక్తిని హింసించి హత్య చేసి, ఆధారాలను మాయం చేశారని ఆరోపించారు. కుటుంబ సభ్యులకు కనీసం అస్థికలు కూడా ఇవ్వలేదని అన్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైన తర్వాత ప్రభుత్వం వైఖరి మార్చుకుందని, తొలుత బాధితుడిని రౌడీషీటర్గా చిత్రీకరించి, తర్వాత కుటుంబాన్ని పిలిచి న్యాయం చేస్తామని చెప్పడం విరుద్ధ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం అమలు కావడం లేదని, బాధితులకు మద్దతు తెలిపిన వారిపైనా విమర్శలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ చర్యలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.