
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
YS Jagan Latest Press Meet: రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలు, రైతాంగ సమస్యలు, కూటమి ప్రభుత్వంలో సాగుతున్న అరాచకాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 'రూల్ ఆఫ్ లా' (చట్టబద్ధ పాలన) స్థానంలో 'రూల్ ఆఫ్ ఫియర్' (భయాందోళనల పాలన) నడుస్తోందని ఆయన ఆరోపించారు.
రెడ్బుక్ రాజ్యాంగం.. భయానక వాతావరణం రెండేళ్ల క్రితం వరకు సంక్షేమం, విద్య, వైద్యం, పరిపాలనా సంస్కరణల్లో విప్లవాత్మక మార్పులతో దేశంలోనే ఏపీ పేరు మారుమోగిందని.. కానీ నేడు కస్టోడియల్ డెత్స్, శవాల మాయం, రెడ్బుక్ రాజ్యాంగం, అబద్ధాల పాలనకు కేరాఫ్ అడ్రస్గా మారిందని జగన్ విమర్శించారు.
చంద్రబాబు తన అవినీతి, దోపిడీని ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో చట్టాన్ని చేతిలోకి తీసుకుని ప్రతిపక్షాలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, జర్నలిస్టులపై అరాచకాలను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు పోలీస్ స్టేషన్లపై నమ్మకం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
లాకప్ డెత్స్.. అమానవీయ ఘటనలు రాష్ట్రంలో సాగుతున్న 'జంగిల్ రాజ్' (రాక్షస పాలన)కు అద్దం పట్టేలా పలు ఘటనలను వైఎస్ జగన్ ఉదహరించారు. విజయవాడలో సాయికృష్ణ కేసు, పోలీసుల వేధింపులకు బలైన క్రాంతికుమార్ ఉదంతం, కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్, తెనాలిలో తిరుపతమ్మ, శ్రీకాకుళంలో కళావతి కేసులను ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఉదహరించారు.
"కస్టడీలోని వ్యక్తిని దారుణంగా కొట్టి చంపి, కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వకుండా శవాన్ని మాయం చేయడం అత్యంత అమానవీయ, పాశవిక చర్య. స్టేట్ హెడ్క్వార్టర్స్ పోలీసులే దీనికి ఒడిగట్టడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది" అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
డైవర్షన్ పాలిటిక్స్.. ఈ ఘోరాలపై ప్రశ్నిస్తే చంద్రబాబు తన అనుకూల మీడియాతో ఎదురుదాడి చేయిస్తున్నారని.. ప్రజల దృష్టిని మళ్లించడానికి తన పొలిటికల్ పార్టనర్ను (సైడ్ క్యారెక్టర్లా) తెరపైకి తెచ్చి డ్రామాలు ఆడిస్తున్నారని విమర్శించారు. సాయికృష్ణను మొదట రౌడీషీటర్ అని అవమానించి, జనం ఛీత్కరించుకునేసరికి యూ-టర్న్ తీసుకుని సెక్రటేరియట్కు పిలిపించుకున్నారని ఎద్దేవా చేశారు.
నిందితులను కాపాడుతున్న సీపీ, డీజీపీ? సాయికృష్ణ కేసులో రిమాండ్ రిపోర్టును గమనిస్తే పెద్దలను కాపాడేందుకు దర్యాప్తును ఎలా వీక్ చేస్తున్నారో స్పష్టమవుతోందని జగన్ ఆరోపించారు.
ఉన్నతాధికారుల బాధ్యత ఏది?: టాస్క్ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను కృష్ణలంక పీఎస్కు అప్పగించినట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది. టాస్క్ఫోర్స్ నేరుగా పోలీస్ కమిషనర్ (CP) కింద పనిచేస్తుంది. మరి సిపిని ఎందుకు విచారించడం లేదు?
ఫిర్యాదులను పట్టించుకోలేదు: మే 28న సాయికృష్ణ తల్లి తన కొడుకు లాకప్ డెత్పై అనుమానాలు ఉన్నాయని విజయవాడ సీపీకి అర్జీ ఇచ్చినా, బంధువులు డీజీపీకి చెప్పినా ఎందుకు స్పందించలేదు?
రక్షణ వలయం: "ఇక్కడ సీఐని సీపీ కాపాడితే.. సీపీని డీజీపీ, డీజీపీని స్వయంగా చంద్రబాబు కాపాడుతున్నారు" అని జగన్ తీవ్ర విమర్శలు చేశారు. క్రాంతికుమార్ మరణవాంగ్మూలం వీడియో వైరల్ అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తాము స్వయంగా బాధితులను పరామర్శించిన 4 రోజుల వరకు అరెస్టులు చేయలేదని, తానే గనుక వెళ్లకపోతే ఈ రెండు కేసులను పూర్తిగా నొక్కేసేవారని స్పష్టం చేశారు.
విజయవాడ నగరంలోనే ఇలాంటి ఘోరాలు జరిగితే.. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా సాగుతున్న ఈ రెడ్బుక్ పాలనలో.. ఆధారాలు నాశనం చేయడం, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం సర్వసాధారణమైపోయిందని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతటి మానవహక్కుల ఉల్లంఘనను తామెన్నడూ చూడలేదని జగన్ పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.