
తెలంగాణలో హెచ్ఐవీపై అవగాహన, పరీక్షలను యువతకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన, విప్లవాత్మక విధానానికి శ్రీకారం చుట్టింది. హెచ్ఐవీ ముప్పును వ్యక్తిగతంగా అంచనా వేసుకోవడంతోపాటు సమీపంలోని పరీక్షా కేంద్రం వివరాలను సులభంగా తెలుసుకునేలా ప్రత్యేక క్యూఆర్ కోడ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. బహిరంగ ప్రదేశాలు, ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, డిగ్రీ, ప్రొఫెషనల్ కళాశాలలు, ఐటీ హబ్లు, రైల్వే, బస్ స్టేషన్లు, మాల్స్ వంటి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే రద్దీ ప్రాంతాల్లో ఈ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేయనున్నారు.ఈ క్యూఆర్ కోడ్ను తమ మొబైల్ ఫోన్తో స్కాన్ చేసిన తర్వాత వినియోగదారులు కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా తమకు హెచ్ఐవీ ముప్పు ఎంతవరకు ఉందో పూర్తిగా ప్రైవేట్గా అంచనా వేసుకోవచ్చు. ఆరోగ్య కార్యకర్తలను నేరుగా సంప్రదించాల్సిన అవసరం లేకుండానే రిస్క్ స్థాయిని తెలుసుకునే అవకాశం దీని ద్వారా కలుగుతుంది. వినియోగదారులు ఇచ్చిన సమాధానాల ఆధారంగా వారికి హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అన్నదానిపై తగిన మార్గదర్శకత్వం లభిస్తుంది.తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ కె. విద్యాసాగర్ మాట్లాడుతూ.. ప్రజల్లో హెచ్ఐవీపై అవగాహన పెంపొందించడం, ముప్పు ఉన్నవారు స్వచ్ఛందంగా పరీక్షలకు ముందుకు వచ్చేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే సమీపంలోని యాంటీ రెట్రోవైరల్ థెరపీ కేంద్రం లేదా సంబంధిత పరీక్షా కేంద్రం వివరాలు స్క్రీన్పై ప్రత్యక్షమవుతాయని చెప్పారు. ముఖ్యంగా తమ హెచ్ఐవీ స్థితి గురించి తెలుసుకోవడంలో సంకోచించే యువత, నేరుగా ఆసుపత్రికి వెళ్లేందుకు ఇబ్బంది పడే వారికి ఈ స్వీయ అంచనా సాధనం ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.హెచ్ఐవీ/ఎయిడ్స్తో పాటు సిఫిలిస్పై కూడా విస్తృత అవగాహన కల్పించేందుకు సమాచార, విద్య, కమ్యూనికేషన్ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేస్తున్నారు. యువతతోపాటు కార్పొరేట్ ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర కీలక వర్గాలను భాగస్వామ్యం చేసేందుకు ప్రముఖ కార్పొరేట్ సంస్థల సహకారం కోరనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 127 ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్లు, 11 మొబైల్ ఐసీటీసీలు, 22 ఏఆర్టీ కేంద్రాలు, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో మరో 11 ఏఆర్టీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. క్యూఆర్ కోడ్ వ్యవస్థ విస్తృతమవడం ద్వారా అవగాహన, రిస్క్ అంచనా, పరీక్ష, కౌన్సెలింగ్, చికిత్స మధ్య ఉన్న అంతరాన్ని పూర్తిగా తగ్గించి వ్యాధి వ్యాప్తిని సమర్థంగా నియంత్రించవచ్చని అధికారులు ఆశిస్తున్నారు.




