
దిల్లీ: భారత్‌లో జూన్‌ - ఆగస్టు మధ్యకాలంలో వాతావరణ మార్పుల కారణంగా 11.7 కోట్లమంది ప్రజలు కనీసం 30 రోజులపాటు ప్రమాదకర వేడి తాకిడికి గురయ్యారని, ఈ సంఖ్య ప్రపంచంలోనే అత్యధికమని ఓ అధ్యయనం వెల్లడించింది. ఒక ప్రాంతంలో 1991-2020 మధ్యకాలంలో నమోదైన 90 శాతానికి పైగా ఉష్ణోగ్రతల సగటును దాటితే ప్రమాదకర ఉష్ణోగ్రత రోజులని అంటారు. ఈ వేడి వ్యక్తుల్లో అనారోగ్యానికి దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 1991-2020 మధ్యకాలం నాటి సరాసరితో పోలిస్తే ఈ ఏడాది జూన్‌ - ఆగస్టు నెలల్లో భారత్‌లో ఉష్ణోగ్రత సాధారణం కన్నా 0.7 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువ నమోదైంది. స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం ‘క్లైమేట్‌ సెంట్రల్‌’ బుధవారం ఈ నివేదికను వెలువరించింది. ఈ వేసవిలో భారత్‌లో ప్రతి ఒక్కరూ సగటున 39 రోజులపాటు అధిక ఉష్ణోగ్రత అనుభవించారని, వాతావరణంలో వస్తున్న మార్పులు ఇందుకు కారణమని అధ్యయన నివేదిక తెలిపింది. శ్రీనగర్‌లో 53 రోజులపాటు ప్రమాదకర వేడి నమోదైంది. చెన్నైలో 40 రోజులు, రాజ్‌కోట్‌లో 29, అమృత్‌సర్‌లో 29, లఖ్‌నవూలో 27 రోజులు ప్రమాదకరమైన వేడి నమోదైంది. అన్నిటికంటే ఎక్కువగా ముంబయిలో 86 రోజుల ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పులతో ప్రభావితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లమందికి పైగా ప్రజలు 30 లేదా అంతకంటే ఎక్కువ రోజులు ప్రమాదకరమైన వేడితో సతమతం అయ్యారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





