
పాకిస్థాన్‌ రాయబారికి సమన్లు దిల్లీ: అరేబియా సముద్రం అంతర్జాతీయ జలాల్లో పాకిస్థాన్‌ నౌకాదళానికి చెందిన నౌక అనుచితంగా వ్యవహరించింది. భారత నౌకాదళానికి చెందిన ప్రధాన యుద్ధనౌకను పాక్‌ నౌక ఢీకొంది. దీనిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం దిల్లీలోని పాక్‌ రాయబారికి బుధవారం సమన్లు జారీ చేసింది. గతేడాది జరిగిన పహల్గాం దుర్ఘటన, ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లతో భారత్, పాకిస్థాన్‌ల మధ్య దౌత్యపరంగా ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం భారత నౌకను పాక్‌ షిప్పు ఢీకొనడం నిర్లక్ష్యపూరిత ప్రవర్తనగా భారత్‌ తీవ్రంగా ఖండించింది. ‘‘సైనిక విన్యాసాలు, కసరత్తులు, దళాల కదలికలపై ముందస్తు నోటీసుకు సంబంధించి ఇరు దేశాల మధ్య 1991లో జరిగిన ఒప్పందం ఉంది. ఆ ఒప్పందంలోని ఆర్టికల్‌ 10ని పాక్‌ నౌక ఉల్లంఘించింది. అనైతిక పద్ధతిలో విన్యాసాలు చేయడమే ఈ పరిస్థితికి కారణం’’ అని పేర్కొంది. అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ వద్ద దీన్ని లేవనెత్తాలని ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యవేత్తను కోరింది. ఈ ఘటన జరిగిన సమయంలో భారత నౌక అరేబియా జలాల్లో గస్తీ తిరుగుతోంది. భారత్‌ వైపు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, హునైన్‌ క్లాస్‌కు చెందిన పాక్‌ నౌక బాగా దెబ్బతిన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





