
కౌశికుడు అనే రుషి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి.. ధర్మదేవత ప్రత్యక్షమైంది. ‘ఎంతో విశిష్టం, పరమ పవిత్రం అయిన పుణ్యలోకాలు ప్రాప్తించే వరాన్ని నీకు ప్రసాదించాను. నిశ్చింతగా వెళ్లు!’ అంది. ‘కానీ.. అమ్మా! ఈ శరీరంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. దాన్ని వదిలి వెళ్లాల్సిన లోకాలు నాకెందుకు? అవెంతో మేలైనవే. కాదనను కానీ.. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఈ శరీరం నా వల్ల కలిగే బాధలన్నింటినీ భరించి, ఎంతగానో సహకరిస్తోంది. అట్లాంటి అనుకూలమైన దేహాన్ని విడిచి వెళ్లడం ఎంత వరకూ న్యాయం?’ అన్నాడు కౌశికుడు. ఇది మహాభారతం, శాంతిపర్వంలోని కథ. దీన్ని బట్టి జీవులకు ఇహలోకంలో శరీరం మీద మమకారం అంత సులభంగా వదిలేది కాదని స్పష్టమవుతుంది. ‘ఈ శరీరాన్ని నిశ్చింతగా వదిలెయ్యి. స్వర్గంలో నీ కోసం బ్రహ్మాండమైన సుఖాలు ఎదురుచూస్తున్నాయి, ఘనంగా వెళ్లు!’ అని మృత్యుశయ్య మీద పడుకుని ఉన్న వ్యక్తికి ఎవరు చెప్పినా, ఆ క్షణాల్లో అతడు కౌశిక రుషి వలెనే ఆలోచిస్తాడు- అనటంలో సందేహం లేదు. ఏ ప్రాణికైనా అన్నింటి కంటే ఎక్కువగా తన శరీరం మీదే మమకారం ఉంటుంది, తక్కినవి అన్నీ కూడా తర్వాతేనని అర్థమవుతుంది. మమకార రాహిత్యంలోనే శాశ్వతానందమని గ్రహించాలి. ‘ఇహలోకంలో మోహాలు, మమకారాలను వదిలేసిన వారే అన్నిటికీ అతీతులు. అప్పుడు పాపలోకంలో ప్రవేశించాల్సిన అవస్థ ఉండదు, పరలోకంలో శాశ్వతానందం దక్కుతుంది’ అని భారతం విశదపరిచింది. .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


