
ఊసేలేని కాల్‌ సెంటర్, హెల్ప్‌ డెస్క్‌లు అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: బాల్య వివాహాల నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణ, చట్టాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘ఛైల్డ్‌లైన్‌-1098’ ఉమ్మడి జిల్లాలో మూగబోయింది. అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లో రెండు నెలలుగా వీటి కార్యకలాపాలన్నీ అటకెక్కగా.. ఆశించిన లక్ష్యం నీరుగారుతోంది. అదే సమయంలో ఉద్యోగాల భర్తీపైనా ఆరోపణలు రావడం పరిస్థితికి అద్దం పడుతోంది. జిల్లా మహిళా, శిశుసంక్షేమశాఖ(ఐసీడీఎస్‌) నిర్వహణలో ఉన్న ఛైల్డ్‌లైన్‌ సంస్థను ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచి విజవాడకు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు స్వాధీనం చేశారు. శ్రీసత్యసాయి జిల్లాకు కొత్త యూనిట్, హిందూపురం, ధర్మవరం రైల్వే స్టేషన్లలో హెల్ప్‌ డెస్క్‌లు, ఇదే తరహాలో అనంతపురం జిల్లాలోనూ అనంత ఆర్టీసీ బస్టాండ్, గుంతకల్లు రైల్వే స్టేషన్లలో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. రెండు నెలలు గడుస్తున్నా.. వీటి విషయంలో అతీగతీ లేదు. అనంత జిల్లా యూనిట్‌ పాతదే ఉండగా- పుట్టపర్తిలో కొత్త యూనిట్‌ నెలకొల్పారు. కాల్‌సెంటర్లు మాత్రం లేవు. పగటి పూట వచ్చే ఫోన్లు నమోదు చేసుకుంటుండగా- రాత్రిళ్లు వచ్చే కాల్స్‌పై ఎలాంటి సమాధానం లేదు. ఐసీడీఎస్‌ అనుబంధ సమగ్ర బాలల సంరక్షణ సమితి(ఐసీపీఎస్‌) పర్యవేక్షణలోనే సదరు ప్రైవేటు ఏజెన్సీ పని చేస్తుందని చెప్పినా.. కొత్త పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రభుత్వ యంత్రాంగం నిమిత్తం లేకుండానే పూర్తి చేశారు. హెల్ప్‌ డెస్క్‌ల్లో పనిచేసేందుకు పర్యవేక్షకులు, ఇతర సిబ్బందిని సదరు ఏజెన్సీనే ఏకపక్షంగా భర్తీ చేసిందనే విమర్శలు ఉన్నాయి. మొత్తం 30 మందికి నియామక ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తుండగా- ఈ ప్రక్రియలో డబ్బు సైతం చేతులు మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. అదీ నేరుగా విజయవాడకు పిలిపించి నియామక పత్రాలు ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందికి జులై నుంచి జీతాలు కూడా ఇవ్వలేదని తెలిసింది. ఛైల్డ్‌లైన్‌లో కొత్త పోస్టుల భర్తీ ఎలా జరిగిందో తెలియదు. ఆ సంస్థలో చేరామంటూ కొందరు వచ్చి పరిచయం చేసుకున్నారు. హెల్ప్‌ డెస్క్‌లు, కాల్‌ సెంటర్‌ త్వరలోనే పెడతామని చెప్పారు. ఆ ఏజెన్సీ ప్రతినిధులు సైతం మా వద్దకు రాలేదు. సక్రమంగా పని చేసేలా చర్యలు తీసుకుంటాం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



