
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఐటీ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడం, అమెరికా-ఇరాన్ చర్చల ఫలితంపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించడం మార్కెట్లపై ప్రభావం చూపింది.
రోజంతా హెచ్చుతగ్గుల మధ్య సాగిన ట్రేడింగ్లో నిఫ్టీ 80.50 పాయింట్లు కోల్పోయి 23,865.75 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 249.70 పాయింట్లు పడిపోయి 76,478.67 వద్ద స్థిరపడింది.మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. నిఫ్టీకి ప్రస్తుతం 24,000 స్థాయి ప్రధాన నిరోధంగా మారింది. ఈ స్థాయిని దాటితే మళ్లీ కొనుగోళ్ల జోరు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు 23,800 స్థాయి కీలక మద్దతుగా ఉందని, ఆ స్థాయి కంటే దిగువకు వెళితే మరింత ఒత్తిడి కనిపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.సెన్సెక్స్లో మారుతి సుజుకి, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో స్థిరపడ్డాయి. మరోవైపు ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు నష్టపోయాయి.ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిసినా మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్లలో కొనుగోళ్లు కొనసాగాయి. నిఫ్టీ మిడ్క్యాప్ సూచీ 0.37 శాతం, స్మాల్క్యాప్ సూచీ 1.02 శాతం లాభపడింది. రంగాల వారీగా చూస్తే ఐటీ, మీడియా, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి కనిపించింది. రియాల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కెమికల్స్ రంగాల షేర్లు మాత్రం కొనుగోళ్లతో లాభాల్లో ముగిశాయి.