
కర్ణాటకవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ (SSR) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. కొద్దిసేపటి కిందటే బెంగళూరు సదాశివనగర్ నివాసంలో దీన్ని స్వయంగా ప్రారంభించారు.
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆయన నివాసానికి చేరుకుని ఓటరు వివరాల నమోదుకు సంబంధించిన ఫారమ్‌ను అందజేశారు. ఆ దరఖాస్తును ఆయన నింపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐఆర్ ఆరంభమైంది.ఈ సందర్భంగా డీకే శివకుమార్ మాట్టాడారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ డ్రైవ్ ప్రారంభం కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, అర్హులైన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించడమే ఈ సవరణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు రాష్ట్రంలోని ప్రజలందరూ బాధ్యతగా తమ ఓటరు నమోదు వివరాలను ఒకసారి సరిచూసుకోవాలని సూచించారు.ఓటర్ల జాబితాలో నూతన మార్పులు, చేర్పులు లేదా కొత్త నమోదు కోసం దరఖాస్తు చేసుకోవడానికి జూలై 29ని ఆఖరి గడువుగా నిర్ణయించారు. ఈ దరఖాస్తు ఫారమ్‌లో వివరాలను నింపడం తనకు కూడా కష్టంగానే అనిపించిందని, సామాన్య ప్రజలు తగిన సమయం తీసుకుని అత్యంత జాగ్రత్తగా వివరాలను పూరించాలని చెప్పారు. గడువు ముగిసేలోగా ఓటు హక్కు లేని యువతీ యువకులు, అర్హులైన వారందరూ తమ దరఖాస్తులను సమర్పించాలని అన్నారు.నూతన ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం నిబంధనలను కఠినతరం చేసింది. ముఖ్యంగా 2002వ సంవత్సరం కంటే ముందు ఎన్నడూ ఓటు హక్కును వినియోగించుకోని వాళ్లు తమ దరఖాస్తులతో పాటు అధికారిక నివాస ధృవీకరణ పత్రం లేదా కుల ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ గుర్తింపు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎన్నికల అధికారులు ఓటరు జాబితాలో పేర్లను చేర్చేందుకు తుది అనుమతి ఇస్తారని డీకే శివకుమార్ వివరించారు.వివిధ రకాల సంక్షేమ పథకాలను పొందడానికి ఓటరు జాబితాలో పేరు ఉండటం ఎంతో ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే భవిష్యత్తులో స్థానిక గుర్తింపు కోల్పోవడంతో పాటు ప్రభుత్వం అందించే గ్యారెంటీ పథకాల లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించే ప్రమాదం ఉందని ప్రజలను హెచ్చరించారు. అందుకే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి కుటుంబం తమ పేర్లను ఓటరు లిస్టులో ఉందో లేదో వెంటనే వెరిఫై చేసుకోవాలని కోరారు.