
India vs England : ఐర్లాండ్ పర్యటనలో ఊహించని విధంగా టీ20 సిరీస్ను కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు తన తదుపరి పోరు కోసం ఇంగ్లాండ్కు చేరుకుంది.
అయితే ఇంగ్లాండ్తో జరగబోయే 5 మ్యాచ్ల టి20 సిరీస్తో పాటు, జూలై 14 నుంచి ప్రారంభం కానున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు భారత జట్టుకు ఊహించని భారీ షాక్ తగిలింది. టీమిండియా యువ సంచలనం, ఎస్ఆర్హెచ్ స్టార్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఇంగ్లాండ్ వన్డే సిరీస్కు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో నితీష్ రెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆ టూర్ ప్రారంభానికి ముందే అతను గాయపడటం గమనార్హం.
నితీష్ కుమార్ రెడ్డి గతంలో జరిగిన భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మూడో వన్డే మ్యాచ్ ముగిసిన తర్వాత తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ఆ సమయంలో అతనికి చేసిన స్కాన్ రిపోర్టులలో స్వల్పంగా కండరం పట్టినట్లు తేలింది. ఈ గాయం వల్లే అతను ఐర్లాండ్ టూర్తో పాటు, ఇంగ్లాండ్తో జరిగే టి20 సిరీస్కు దూరమయ్యాడు. తాజా సమాచారం ప్రకారం.. నితీష్ రెడ్డి ఇంకా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లోనే ఉన్నాడని, కనీసం రీహాబిలిటేషన్ కూడా ఇంకా ప్రారంభించలేదని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది. వన్డే సిరీస్ ప్రారంభానికి కేవలం 14 రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. అతను ఫిట్నెస్ నిరూపించుకుని ఇంగ్లాండ్ వెళ్లడం అసాధ్యంగా కనిపిస్తోంది. వైద్యులు కూడా అతనికి మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని సూచించారు.
నితీష్ కుమార్ రెడ్డి గాయంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. వన్డే జట్టులో అతని స్థానంలో పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ సూర్యాంశ్ షెడ్గేను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఐర్లాండ్, ఇంగ్లాండ్ టి20 సిరీస్ల కోసం నితీష్ స్థానంలో సూర్యాంశ్ జట్టుతోనే ఉన్నాడు. అతను ప్రస్తుతం ఇంగ్లాండ్లోనే అందుబాటులో ఉండటం వల్ల, వన్డే సిరీస్కు కూడా అతనినే కొనసాగించడం సెలెక్టర్లకు సులువైన పని. శ్రీలంకలో జరిగిన భారత్-ఎ త్రైపాక్షిక సిరీస్లో సూర్యాంశ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
మరోవైపు, ఇంగ్లాండ్ టూర్ ముగిసిన వెంటనే భారత జట్టు మూడు మ్యాచ్ల టి20 సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ ఆఫ్రికా పర్యటన నాటికి నితీష్ కుమార్ రెడ్డి పూర్తిగా కోలుకుని జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. జింబాబ్వే సిరీస్ కోసం సెలెక్టర్లు ఎలాగూ సీనియర్లకు విశ్రాంతినిచ్చి, రెండో శ్రేణి యువ జట్టును పంపించనున్నారు. కాబట్టి ఆ టూర్ ద్వారా నితీష్ రెడ్డి తన ఫిట్నెస్ను నిరూపించుకుని అంతర్జాతీయ క్రికెట్లోకి మళ్లీ అడుగు పెట్టవచ్చని భావిస్తున్నారు.
ఇదే సమయంలో భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్, సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ సిరీస్ కోసం ముందస్తుగానే లండన్ చేరుకోబోతున్నారు. మిగిలిన వన్డే ఆటగాళ్లు విడతల వారీగా ఇంగ్లాండ్ చేరుకున్నప్పటికీ.. గిల్, రాహుల్ మాత్రం పిచ్ పరిస్థితులపై ముందే అవగాహన పెంచుకోవడానికి, నెట్స్ ప్రాక్టీస్ ప్రారంభించడానికి ముందుగానే వెళ్లనున్నారు. ఇంగ్లీష్ గడ్డపై ఇంగ్లాండ్ జట్టును వారి సొంత పరిస్థితుల్లో ఎదుర్కోవడం గిల్కు ఒక కెప్టెన్గా పెద్ద పరీక్ష కానుంది. గత 2022 ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1 తో గెలుచుకుంది. ఆ సెంటిమెంట్ను రిపీట్ చేస్తూ ఈసారి కూడా సిరీస్ కైవసం చేసుకోవడమే టీమిండియా ప్రధాన లక్ష్యం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..