
నైరుతి రుతుపవనాలు విస్తరించినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం నెలకొంది. ఎల్ నీనో ప్రభావంతో వర్షాలు అంతగా కురవడం లేదు.. ఎండలతోపాటు.. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలోనే..
వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది.. రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు మెరుపులతోపాటు.. ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణలో నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా మారాయని.. దీని ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. జులై 4వ తేదీ వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
మంగళవారం.. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. బుధవారం నుంచి వర్షాల తీవ్రత పెరుగుతుందని అంచనా వేశారు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ప్రసరణ ప్రభావం కారణంగా మంగళవారం ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మిగిలిన జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు.
ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.