
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఫ్రాన్స్లో జరుగుతున్న అన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్లో హంగామా చేస్తున్నారు. ఆయన తీసిన చిత్రాల ప్రొజెక్షన్ అక్కడ జరుగుతుంది.
దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) ప్రస్తుతం ఫ్రాన్స్లో జరుగుతున్న అన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్లో హంగామా చేస్తున్నారు. ఆయన తీసిన చిత్రాల ప్రొజెక్షన్ అక్కడ జరుగుతుంది. ప్రపంచ స్థాయి సినీ దర్శకులతో ఆయన ఇంటరాక్ట్ అవుతున్నారు. అలాగే గత చిత్రాల, ప్రస్తుతం తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాల ప్రత్యేకతలను ఆయన వివరిస్తున్నారు. ఈ మేరకు ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా గురించి ఆసక్తికర విషయాలుు వెల్లడించారు. మైథాలలజీ, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, ఫాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ ఇలా అనేక అంశాలను మిళితం చేసి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఆయన ప్రకటించారు. రాజమౌళి మాట్లాడుతూ ‘ఆఫ్రికా అడవుల్లో జంతువుల క్రూరత్వం, అంటార్కిటికాలోని మంచు పర్వతాల చల్లదనం, రామాయణంలోని పాత్రలు, ప్రకృతి విలయాలు, ఫాంటసీతో ముంచెత్తే అద్భుత విన్యాసాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. అయితే వీటి అన్నింటి కంటే తండ్రీ కొడుకుల మధ్య ఉండే బంధం, భావోద్వేగాలు ఈ కథకు మూలం’ అని అన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తి చేసినట్లు జక్కన్న తెలిపారు. అయితే ఓ కీలక సన్నివేశానికి సంబంధించిన షెడ్యూల్ త్వరలో హైదరాబాద్లో ప్రారంభించనున్నారట.
హీరోతోపాటు 3,500 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ షూటింగ్ జరగనుందని, అవన్నీ యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలని రాజమౌళి తెలిపారు. ఈ సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయట. ఈ యుద్ధ సన్నివేశాలు ఏకంగా 50 వేల మంది వానరులు ఒకేసారి తెరపై కనిపించడానికి నూతన విజువల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు రాజమౌళి తెలిపారు. ఇది ప్రేక్షకులకు కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ఈవెంట్లో రాజమౌళి చెప్పారు. దుర్గా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.