
ఐదేళ్ల పాటు రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసిన వైసీపీ నేతలు ( YCP leaders) ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad...
ఐదేళ్ల పాటు రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసిన వైసీపీ నేతలు ( YCP leaders) ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) మండిపడ్డారు. అమరావతిలో మంత్రి రాంప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ రాజధానిగా అమరావతిని అంగీకరించని వైసీపీ నేతలకు ఇప్పుడు అక్కడ పర్యటించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిని అడ్డుకోవడం వైసీపీ రాజకీయ అజెండాగా మారిందని అన్నారు. అభివృద్ధి(Development) కోసం కాదు, అలజడి సృష్టించడం కోసమే వైసీపీ నేతలు అమరావతిలో పర్యటిస్తున్నారని విమర్శించారు. నిర్మాణాలు జరిగే ప్రాంతంలో ఘర్షణలకు కారణం వైసీపీ నేతల రెచ్చగొట్టే వైఖరే అని పేర్కొన్నారు. అమరావతి (Amaravati) అభివృద్ధిని ప్రజలు స్వాగతిస్తుంటే, వైసీపీ మాత్రం అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై వైసీపీ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నేతలు అమరావతి వేదికగా మరో డ్రామా ప్రారంభించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఎలాంటి కుట్రలు చేసినా రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆపలేరని వైసీపీ నేతలకు స్పష్టం చేశారు.