తెలంగాణలో గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, వారిని స్వయం ఉపాధి రంగాల్లో అగ్రగాములుగా నిలిపేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు త్వరలోనే ఆధునిక రైస్ మిల్లులను మంజూరు చేయనున్నట్లు రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు రాబోయే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో దిశా నిర్దేశం చేశారు.ఈ నెల 30న ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి అడ్డరోడ్డు వద్ద నిర్వహించ తలపెట్టిన ప్రతిష్టాత్మక రైతు ఆశీర్వాద సభ ప్రాంతాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. అంతకుముందు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఈ సభాస్థలిని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం నేలకొండపల్లి మండలంలో పలు ప్రగతి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు ఉమ్మడి భాగస్వామ్యంతో రైస్ మిల్లులు అందించే ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి నేలకొండపల్లి మండలం నుంచే పైలట్ ప్రాజెక్ట్గా శ్రీకారం చుట్టనున్నట్లు స్పష్టం చేశారు.తెలంగాణలో మహిళా సాధికారత అనేది కేవలం నినాదాలకే పరిమితం కాకుండా.. వారిని నిజమైన వ్యాపారవేత్తలుగా మార్చడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి కొనియాడారు. ఇందులో భాగంగానే మహిళా సంఘాలకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల నిర్వహణ, ఇందిరమ్మ క్యాంటీన్లు, ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల నిర్వహణ వంటి బాధ్యతలను ప్రభుత్వం విజయవంతంగా అప్పగించిందని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రవేశపెట్టబోయే రైస్ మిల్లుల మంజూరు పథకం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక ఎదుగుదలకు మరింత ఊతాన్ని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని మహిళా సంఘాల ద్వారానే కొనుగోలు చేసి వారి మిల్లుల్లోనే నాణ్యమైన బియ్యంగా మార్చి మార్కెటింగ్ చేసేలా ఒక సమగ్రమైన వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సుమారు కోటి మంది మహిళలను ఐదేళ్ల కాలంలో కోటీశ్వరులను చేయాలనే సంకల్పం, స్పష్టమైన లక్ష్యంతోనే ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోందని అందుకు అనుగుణంగానే ప్రతి పథకంలోనూ మహిళలకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి పొంగులేటి వివరించారు. ఈ రైస్ మిల్లుల స్థాపన ద్వారా స్థానికంగా ఉన్న వందలాది మంది మహిళలకు ఉపాధి లభించడమే కాకుండా.. దళారీల వ్యవస్థకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.