
3న జిందాల్ ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన వర్చువల్గా పాల్గొననున్న సీఎం చంద్రబాబు ఈనాడు, విజయనగరం: విజయనగరం జిల్లా ఎస్.కోటలో జిందాల్ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు కానుంది.
దీనికి జులై 3న శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అదే రోజు కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి వర్చువల్గా జిందాల్ ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. ఈ పార్కులో రూ.3,970 కోట్ల పెట్టుబడులతో వివిధ పరిశ్రమలు నెలకొల్పేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. వీటి ద్వారా 45వేల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు.
ఎన్ని మలుపులో..: ఎస్.కోటలో అల్యూమినియం ఉత్పత్తి పరిశ్రమ నెలకొల్పేందుకు ముందుకొచ్చిన జిందాల్ యాజమాన్యం 2005లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మండలంలోని ముసిడిపల్లి, చీడిపాలెం, చినఖండేపల్లి, ఎం.బి.వర, కిత్తంపాలెం గ్రామాల పరిధిలోని 1164.43 ఎకరాలను సేకరించి అప్పగించాలని సంస్థ కోరింది. అప్పటి మార్కెట్ విలువకు 985 ఎకరాల ప్రభుత్వ భూమి, 180.73 ఎకరాల జిరాయితీ సేకరించి కంపెనీ పేరిట ప్రభుత్వం రిజిస్టర్ చేసింది. అనంతర పరిణామాల్లో మన్యంలో బాక్సైట్ తవ్వకాలను ప్రభుత్వం విరమించుకోవడంతో జిందాల్ కంపెనీ అల్యూమినియం కర్మాగారం నిర్మాణ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఆ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచింది. దీన్ని 2023లో వైకాపా ప్రభుత్వం ఆమోదించింది. వివిధ అనుమతుల కోసం సంస్థ ప్రయత్నిస్తుండగానే ఎన్నికల ప్రకటన రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. తర్వాత కూటమి ప్రభుత్వ పెద్దలను జిందాల్ యాజమాన్యం పలు దఫాలు సంప్రదించింది. ఈ క్రమంలో నిర్వాసిత రైతులతో కుదుర్చుకున్న నష్టపరిహారం పెంచాలని, గిరిజన రైతులకు న్యాయం చేయాలని చాలాకాలం ఆందోళన కొనసాగించారు. ఇటీవల జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత రైతులతో సమావేశమై న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.