టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ పేరుతో చాలా ఏళ్లుగా ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. మైథలాజికల్ జోనర్ లో భారీ స్కేల్ లో రూపొందించాలని ప్లాన్ చేసుకున్నారు.
సితార నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్టును ఎపుడో కన్ఫర్మ్ చేశారు. పలు సందర్భాల్లో ఈ మూవీ గురించి చెప్పి, అందరిలో ఆసక్తిని రేకెత్తించారు. జూనియర్ ఎన్టీఆర్ తో ఉంటుందని అన్నారు కానీ, ఇంతవరకూ ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. దీంతో అసలు సినిమా ఉంటుందా లేదా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి టైంలో ఉన్నట్టుండి ఇప్పుడు తాజాగా నాగవంశీ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.“ఫైనల్లీ.. నేను ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రోజు రేపే’’ అంటూ నాగవంశీ ఆదివారం ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. దీనికి ఒక నెమలి ఎమోజీని జోడించారు. దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ స్పందిస్తూ.. నెమలి ఎమోజీతో పాటుగా కొత్త ప్రారంభాన్ని సూచించేలా పోస్ట్ పెట్టారు. ఇక్కడ నాగవంశీ ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. సినిమా గురించి అని కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ ‘నెమలి’ ఎమోజీని యాడ్ చేయడంతో, ఇది కచ్చితంగా ఎన్నాళ్లుగానో వార్తల్లో ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గాడ్ ఆఫ్ వార్’ గురించే అని సినీ అభిమానులు భావిస్తున్నారు. తారక్ - త్రివిక్రమ్ కాంబోలో జూన్ 29న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఉంటుందని ఫిక్స్ అయిపోయారు.అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అప్పట్లో ఓ సినిమాని అధికారికంగా ప్రకటించారు. బన్నీ కోసం ఓ అద్భుతమైన మైథలాజికల్ కథను రెడీ చేసినట్లుగా చెప్పుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందనున్నట్లు టాక్ వచ్చింది. అప్పుడే నాగవంశీ ఈ సినిమా గురించి హింట్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ''మోస్ట్ పవర్ ఫుల్ దేవుళ్లలో ఒకరిగా నాకు అత్యంత ఇష్టమైన అన్నయ్య కనిపించబోతున్నారు'' అని ఒక ట్వీట్.. ''గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్'' అంటూ మరో ట్వీట్ చేశారు. వీటికి రెండు సంసృత శ్లోకాలను కూడా జత చేసారు.కుమార స్వామిని ‘గాడ్ ఆఫ్ వార్’ అని పిలుస్తారు. ఆయనకే సుబ్రహ్మణ్య స్వామి, మురుగన్, కార్తికేయ స్వామి, స్కంధుడు వంటి మరికొన్ని పేర్లు ఉన్నాయి. గతంలో ఎన్టీఆర్ ఓ సందర్భంలో చేతిలో మురుగన్ పుస్తకం పట్టుకొని మీడియా కంట పట్టారు. దాంతో కుమార స్వామిగా తారక్ కనిపించబోతున్నారని, దాని కోసమే ప్రిపరేషన్ మొదలుపెట్టారని టాక్ నడిచింది. కానీ త్రివిక్రమ్ - తారక్ ఇద్దరూ వేర్వేరు ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోయారు. ఇప్పుడు సడన్ గా మోస్ట్ అవైటెడ్ డే అంటూ నాగవంశీ పోస్ట్ పెట్టడంతో.. గాడ్ ఆఫ్ వార్ మరోసారి వార్తల్లో నిలిచింది. మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.