
Prabhas:కల్కి 2898 ఏడీ లో కనిపించే పాత్రను తిరస్కరించిన కీర్తి సురేశ్, చివరకు బుజ్జి కి వాయిస్ ఇచ్చి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
దర్శకుడు నాగ్ అశ్విన్తో జరిగిన ఆసక్తికర సంభాషణను ఆమె తాజాగా వెల్లడించారు.
కల్కి 2898 ఏడీ విడుదలై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నటి కీర్తి సురేశ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఏఐ వాహనం బుజ్జికి ఆమె వాయిస్ అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాత్రకు ముందు సినిమాలో కనిపించే మరో కీలక పాత్రను తనకు ఆఫర్ చేశారని, కానీ దానిని తానే తిరస్కరించానని కీర్తి వెల్లడించారు.
దర్శకుడు నాగ్ అశ్విన్ మొదట తనకు ఆన్-స్క్రీన్ పాత్రను వివరించారని, అయితే ఆ పాత్రపై తనకు పూర్తి నమ్మకం కలగకపోవడంతో సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ తనకు మెసేజ్ చేసి, "నా సినిమాలో కనీసం ఒక గోడ చాటు నుంచి అయినా కనిపిస్తావా?" అని సరదాగా అడిగారని గుర్తుచేసుకున్నారు.
అనంతరం సినిమాలో కనిపించాల్సిన అవసరం లేదని, కేవలం బుజ్జి పాత్రకు తన గొంతు మాత్రమే కావాలని నాగ్ అశ్విన్ చెప్పారని కీర్తి తెలిపారు. మొదట ఈ ఆలోచన తనకు కొత్తగా అనిపించినా, వెంటనే అంగీకరించానన్నారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆన్-స్క్రీన్ పాత్రను వదిలేయడం వల్లే బుజ్జి వంటి ప్రత్యేకమైన పాత్ర దక్కిందని, ఆ నిర్ణయం పట్ల చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు.
కల్కి 2898 ఏడీలో ప్రభాస్ పోషించిన భైరవ పాత్రకు అత్యంత నమ్మకమైన సహచరంగా బుజ్జి నిలిచింది. హాలీవుడ్లోని జార్విస్ తరహాలో రూపొందించిన ఈ ఏఐ వాహనం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రభాస్-బుజ్జి మధ్య జరిగే సరదా సంభాషణలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కీర్తి సురేశ్ తెలుగు మాత్రమే కాకుండా తమిళం, మలయాళం సహా పలు భాషల్లో కూడా ఈ పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పారు.
ప్రస్తుతం కీర్తి సురేశ్ విజయ్ దేవరకొండ సరసన తెరకెక్కుతున్న రౌడీ జనార్దన్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు కల్కి 2898 ఏడీ సీక్వెల్పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.