తెలంగాణలో సుస్థిర వ్యవసాయాభివృద్ధి, రైతులకు ఆదాయ భద్రత, పటిష్ట గ్రామీణ ఆర్థిక వ్యవస్థే ధ్యేయంగా రూపొందించిన సమగ్ర వ్యవసాయ విధానం-2026 అమలు చేయాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్ర...
తెలంగాణలో సుస్థిర వ్యవసాయాభివృద్ధి, రైతులకు ఆదాయ భద్రత, పటిష్ట గ్రామీణ ఆర్థిక వ్యవస్థే ధ్యేయంగా రూపొందించిన సమగ్ర వ్యవసాయ విధానం-2026 అమలు చేయాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యల నేపథ్యంలో.. అగ్రి వర్సిటీని నోడల్ ఏజన్సీగా ప్రకటిస్తూ నూతన విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వం గతంలో ఆదేశించింది. దీని ప్రకారం.. వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య నేతృత్వంలోని సుస్థిర వ్యవసాయ, అభివృద్ధి అధ్యయన కేంద్రం జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించగా.. జులై 2న జరగబోయే కేబినెట్ సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 57 లక్షల ఎకరాలుగా ఉన్న నికర సాగు విస్తీర్ణం 2024 నాటికి సుమారు 92 లక్షల ఎకరాలకు చేరుకోవడం గొప్ప ప్రగతి అయినప్పటికీ.. ప్రస్తుతం ఈ రంగం భిన్నమైన సవాళ్లను ఎదుర్కొంటోందని నివేదిక స్పష్టం చేసింది. రైతులు ఒకే పంటపై అధికంగా ఆధారపడటంతో నీరు, భూమి, ప్రభుత్వ వనరులపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. పెరుగుతున్న మిగులు ధాన్యం నిల్వలు, వాటి నిర్వహణ వ్యయాలు, సహజ వనరుల సుస్థిర వినియోగం వంటివి ఇప్పుడు పెద్ద విధానపరమైన సవాళ్లుగా మారాయి. ఈ తరుణంలో నూతన విధానం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకాలని వర్సిటీ అభిప్రాయపడింది. ఆదాయ వృద్ధి, ప్రైవేట్ పెట్టుబడులకు కొత్త అవకాశాలను సృష్టిస్తూ రైతుల జీవన ప్రమాణాలను పెంచడంపై దృష్టి పెట్టాలని సూచించింది.ఈ మార్పుల్లో భాగంగా.. రాబోయే ఐదేళ్లలో 25 లక్షల ఎకరాల వరి సాగు విస్తీర్ణాన్ని దశల వారీగా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని లక్ష్యంగా నిర్దేశించారు. పంట మార్పిడికి స్వచ్ఛందంగా ముందుకొచ్చే రైతులకు ప్రోత్సాహకంగా ఎకరానికి రూ.4 వేల నుంచి రూ.8 వేల వరకు నగదు బదిలీ చేయాలని ప్రతిపాదించారు. పత్తి, పెసర, వేరుసెనగ, పొద్దుతిరుగుడు, నువ్వుల పంట సాగుచేసే రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కాకుండా ఎకరానికి రూ.8 వేల చొప్పున, జొన్నకు రూ.5 వేలు, అలాగే మొక్కజొన్న, కంది, మినుము, ఆముదం, సోయాబీన్, శనగ పంటలకు ఎకరానికి రూ.4 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నివేదికలో పేర్కొన్నారు.రైతులకు కేవలం పంట మార్పిడి మాత్రమే కాకుండా.. ప్రత్యామ్నాయ పంటల కోసం స్థిరమైన, లాభదాయకమైన మార్కెట్ అవకాశాలను అందుబాటులోకి తేవడం అత్యంత అవసరమని వర్సిటీ స్పష్టం చేసింది. ముడి ఉత్పత్తుల విక్రయానికే పరిమితం కాకుండా.. వాల్యూ ఎడిషన్ ద్వారా అధిక లాభాలు పొందేలా పప్పుధాన్యాల మిల్లులు, చిరుధాన్యాలు, నూనె గింజల శుద్ధి కేంద్రాలు, అధునాతన నిల్వ, ప్యాకేజింగ్ మౌలిక సదుపాయాలు, బ్రాండింగ్ మార్కెటింగ్ను ప్రోత్సహించాలి. ఈ ప్రక్రియలో మహిళా స్వయం సహాయక సంఘాలు, ప్రైవేటు సంస్థలకు పెద్దపీట వేయాలి. అలాగే, ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతుల్లో నష్ట భయాన్ని పోగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి నిధులు సమకూర్చి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా ద్వారా ప్రత్యేక పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని నివేదిక సిఫార్సు చేసింది.