
కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరిని రాకాసి అలలు పొట్టన పెట్టుకున్నాయి. నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం కోడూరు బీచ్లో..
తోటపల్లిగూడూరు, జూన్ 27(ఆంధ్రజ్యోతి): కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరిని రాకాసి అలలు పొట్టన పెట్టుకున్నాయి. నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం కోడూరు బీచ్లో శనివారం మధ్యాహ్నం సముద్రంలో స్నానం చేస్తుండగా ఇద్దరు గల్లంతవగా, బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరు గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీ మూడు కుటుంబాలతో కలిసి ఓ టెంపోలో శుక్రవారం నెల్లూరు చేరుకున్నారు. రొట్టెల పండుగలో పాల్గొన్న తర్వాత శనివారం కోడూరు బీచ్కు వెళ్లి, స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. రఫీ కుమారుడు మహమ్మద్ సూఫియాన్ (11), అన్సర్ బాషా కుమార్తె నఫిసా రుక్సాసా (17) అలలకు కొట్టుకుపోయారు. మెరైన్ పోలీసులు మత్స్యకారుల సహాయంతో సుఫియాద్ను ఒడ్డుకు చేర్చేలోపే చనిపోయాడు. రుక్సాసా ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.